Ecommerce Sales: తొలి వారంలోనే రూ.32వేల కోట్లు..!

15 Oct, 2021 20:41 IST|Sakshi

దసరా ఫెస్టివల్‌ సీజన్‌ ఈ కామర్స్‌ కంపెనీలకు వరంగా మారింది. ప్రముఖ కన్సెల్టింగ్‌ సంస్థ రెడ్‌సీర్‌ ప్రకారం..ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు ఫెస్టివల్‌ సేల్స్‌ ప్రారంభించిన మొదటి వారంలోనే వేలకోట్లలో అమ్మకాలు జరిపినట్లు పేర్కొంది. 

ఫ్లిప్‌ కార్ట్‌ అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 10 వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహించింది. అమెజాన్ అక్టోబర్ 4 నుంచి గ్రేట్ ఇండియా ఫెస్టివల్‌ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌ నెల రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సందర్భంగా దసరా ఫెస్టివల్‌ సీజన్ లో ఈ రెండు సంస్థలు అమ్మకాలు ఏ విధంగా జరిపిందనే విషయాలపై రెడ్‌సీర్‌ రిపోర్ట్‌ను విడుదల చేసింది. డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్‌ ఆఫర్లు ప్రకటించడంతో భారీ కొనుగోళ్లు జరిపినట్లు వెల్లడించింది.  మొదటి వారంలోనే  4.6 బిలియన్ డాలర్లు (32 వేల కోట్ల రూపాయలు)  కోట్లు అమ్మకాలు జరిగాయని, ప్రతి గంటకు రూ. 68 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్‌ అమ్మకాలు జరిగినట్లు రిపోర్ట్‌లో పేర్కొంది.  ఇది వార్షిక ప్రాతిపదికన 32 శాతం వృద్ధిని నమోదు చేసింది.

అమ్మకాల్లో ఫ్లిప్‌ కార్ట్‌ ముందంజ 
ఈ సంవత్సరం అమెజాన్‌ కంటే ఫ్లిప్‌కార్ట్ అమ్మకాలు ఎక్కువ జరిపినట్లు తేలింది. పండుగ సేల్స్‌లో ఫ్లిప్‌ కార్ట్‌ మార్కెట్ వాటా 64 శాతానికి దగ్గరగా ఉండగా..అమెజాన్‌ వాటా తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఇక కరోనా కారణంగా గతేడాది కొనుగోళ్లు తగ్గినా.. ఈ ఏడాది మాత్రం పెరిగాయి. దీంతో టైర్ -2, టైర్ -3 నగరాల నుండి పెద్ద సంఖ్యలో కొత్త కస్టమర్లు చేరగా..వారిలో టైర్ -2 కస్టమర్లలో 61 శాతం మంది కొత్త కస్టమర్లేనని తెలిపింది. ఇక గతేడాది ప్రతి కస్టమర్ కొనుగోలుకు సగటు స్థూల వస్తువుల విలువ రూ.4980 ఉండగా  ఈ ఏడాదిలో రూ .5034 కి పెరిగినట్లు రెడ్‌సీర్ కన్సల్టింగ్ అసోసియేట్ పార్ట్‌నర్ ఉజ్వల్ చౌదరి తెలిపారు.

చదవండి: 'బిగ్‌ దివాళీ సేల్‌',మీ కోసం బోలెడు ఆఫర్లు ఉన్నాయ్‌!

మరిన్ని వార్తలు