బయోఇండికేటర్లుగా బరిలోకి పాములు! ఏం చేస్తాయంటే..

7 Aug, 2021 12:46 IST|Sakshi

అణు ప్రమాదాలు కలగజేసే నష్టం మామూలుగా ఉండదు. రేడియేషన్‌ ప్రభావం కొన్ని వందల ఏళ్లపాటు ఆ ప్రాంతాలను పట్టి పీడిస్తుంది కూడా. ఉక్రెయిన్‌లో చెర్నోబిల్‌, జపాన్‌ ఫుకుషిమా అణు రియాక్టర్ల ప్రమాదాలు.. ఎంతటి నష్టాన్ని మిగిల్చాయో కళ్లారా చూసి ఉన్నాం. అలాంటప్పుడు ఇంక అక్కడ మనుషులు అడుగుపెట్టేది ఎప్పుడు? ఇది కనిపెట్టేందుకే సైంటిస్టులు పాముల సాయం తీసుకోబోతున్నారు.

ఫుకుషిమా సైంటిస్టులు ఈ అరుదైన పరిశోధనలకు సిద్ధపడినట్లు ‘ఇచ్‌థైయోలజీ అండ్‌ హెర్పెటోలజీ’ అనే జర్నల్‌ కథనం ప్రచురించింది. అలాగని పాముల్ని హింసించడం లాంటివి చేయరు. సింపుల్‌గా వాటిని బయోఇండికేటర్లుగా ఉపయోగించుకుంటారు. సాధారణంగా మట్టి, గాలి, నీటితో మమేకమై ఉండే వృక్ష, జీవ రాశులన్నింటినీ బయోఇండికేటర్లుగానే గుర్తిస్తారు. వీటి జీవన విధానాన్ని పరిశీలిస్తూ.. అక్కడి పరిస్థితులను అంచనా వేస్తుంటారు. ఉదాహరణకు.. చెట్ల మీద మొలిచే నాచు, గాల్లో ఉండే విషవాయువుల మోతాదును ఇది సూచిస్తుంది. ఎలాగంటారా?.. గాలి నుంచే నాచుకి ఎక్కువ శక్తి లభిస్తుంది కాబట్టి. ఒకవేళ గాల్లో గనుక విష వాయువుల ప్రభావం ఎక్కువగా ఉంటే.. నాచు రంగు మారుతూ నాశనమవుతుంటుంది. 

చదవండి: వంద గ్రాముల విషంతో.. వంద మంది ఖతం!

ఇప్పటిదాకా మొక్కలను, చెట్లను మాత్రమే బయోఇండికేటర్లుగా ఉపయోగించిన సైంటిస్టులు.. ఫస్ట్‌ టైం పాములపై ఈ ప్రయోగం చేస్తు‍న్నారు. పాములను ప్రత్యేకించి జెర్రి పోతు(గొడ్డు) పాములను ఈ ప్రయోగాలకు వాడుకోబోతున్నారు. ఎందుకంటే.. ఇవి ఎక్కువ దూరం ప్రయాణించవు. మట్టితో బాగా కనెక్ట్‌ అయ్యి ఉంటాయి. పైగా దగ్గర దగ్గరగా జీవిస్తుంటాయి. అందుకే వీటిని ఎంచుకున్నారు సైంటిస్టులు.

ఇక ఈ పరిశోధనలో.. ఫుకుషిమా రేంజ్‌లో బతుకుతున్న సుమారు 1700 పాముల్ని నిరంతరం పర్యవేకక్షించబోతున్నారు. వాటిపై రేడియేషన్‌ ప్రభావం, ఫుకుషిమా ప్రాంతంలో వాటి జీవనవిధానం ఆధారంగా రేడియేషన్‌ లెవల్‌ను లెక్కగడతారు. ఎప్పుడైతే మట్టిలో రేడియేషన్‌ ప్రభావం తగ్గుతుందో.. అవి అప్పుడు యాక్టివ్‌గా సంచరిస్తుంటాయి. అలా రేడియేషన్‌ ప్రభావాన్ని లెక్కగట్టబోతున్నట్లు ప్రొఫెసర్‌ హన్నా గెర్కె వెల్లడించారు. ఇక వీటి ట్రాకింగ్‌ కోసం జీపీఎస్‌ వ్యవస్థను ఉపయోగించబోతున్నారు.

మరిన్ని వార్తలు