ఐపీవో బాటలో స్నాప్‌డీల్‌

22 Dec, 2021 08:35 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈకామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ స్నాప్‌డీల్‌ పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇటీవల ఇంటర్నెట్‌ ఆధారిత బిజినెస్‌లు నిర్వహించే పలు కంపెనీలు స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో స్నాప్‌డీల్‌ నిధుల సమీకరణకు ప్రాధాన్యత ఏర్పడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 1,250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్‌చేసిన సంస్థలు మరో 3.07 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. లిస్టింగ్‌ ద్వారా కంపెనీ విలువ 1.5–1.7 బిలియన్‌ డాలర్ల(రూ. 12,750 కోట్లు)కు చేరవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తాజా ఈక్విటీ జారీ నిధులను ఇతర కంపెనీల కొనుగోళ్లు, లాజిస్టిక్స్‌ విస్తరణ, సాంకేతిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచుకోవడం తదితరాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో స్నాప్‌డీల్‌ పేర్కొంది. ఇటీవల ఇంటర్నెట్‌ ఆధారిత దిగ్గజాలు జొమాటో, నైకా, పాలసీబజార్, పేటీఎమ్‌ పబ్లిక్‌ ఇష్యూల ద్వారా నిధులను సమీకరించి స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌ను పొందిన విషయం విదితమే
.
మ్యాప్‌మైఇండియా లాభాల లిస్టింగ్‌ 
ఢిల్లీ: డిజిటల్‌ మ్యాపింగ్‌ కంపెనీ మ్యాప్‌మైఇండియా షేరు తొలిరోజు ఇన్వెస్టర్లకు లాభాలను పంచింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర 1,033తో పోలిస్తే 53 శాతం ప్రీమియంతో రూ.1,581 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో రూ.1,587 వద్ద గరిష్టాన్ని.., రూ.1,395 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. చివరి గంట లాభాల స్వీకరణతో 35% లాభంతో రూ.1,394 వద్ద నిలిచింది. మార్కెట్‌ ముగిసే సరికి కంపెనీ విలువ రూ.7,425 కోట్లుగా నమోదైంది.   
 

మరిన్ని వార్తలు