ఓయో ఫౌండర్‌ రితేష్‌ అగర్వాల్‌ పెళ్లి..సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్‌ మసయోషి సన్ హాజరు

8 Mar, 2023 11:20 IST|Sakshi

ఆతిథ్యం, ప్రయాణ సేవల(ట్రావెల్‌ టెక్‌) కంపెనీ ఓయో అధినేత రితేష్‌ అగర్వాల్‌ (Ritesh Agarwal) వివాహం ఘనంగా జరిగింది. రితేశ్ అగర్వాల్‌- గీతాన్షా దంపతుల వివాహానికి సాఫ్ట్‌బ్యాంక్ చైర్మన్‌ మసయోషి సన్ హాజరయ్యారు. మసయోషితో పాటు ఎయిర్‌ టెల్‌ చైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌, పేటీఎం సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ, లెన్స్‌ కార్ట్‌ సీఈవో  పియోష్‌ బన్సాల్‌ వంటి కార్పొరేట్‌ దిగ్గజాలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రితేష్‌ అగర్వాల్‌ దంపతులు సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్‌ మసయోషి సన్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం దేశీయ కార్పొరేట్‌ వరల్డ్‌లో ఆసక్తికరంగా మారింది. 

ఇక మసయోషి పర్యటనపై విజయ్‌ శేఖర్‌ శర్మ ట్వీట్‌ చేశారు. ఈ రోజు వెలకట్టలేని ఆనందం. మస నవ్వుతూ, సంతోషంగా ఉన్న ఈ ఆనంద సమయాల్లో భారత పర్యటన చేయడం..దేశీయ స్టార్టప్‌లపై అతనికి ఉన్న నమ్మకం, సపోర్ట్‌కు కృతజ్ఞతలు అంటూ మసయోషితో దిగిన ఫోటోల్ని ట్వీట్‌ చేశారు. కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ సైతం పెళ్లికి హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు. 


గత వారం తన వివాహ వేడుక ఆహ్వాన పత్రికను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేశారు. ఢిల్లీలో తన తల్లి, కాబోయే భార్యతో కలిసి మోదీ వద్దకు వెళ్లిన రితేశ్‌.. ప్రధానికి పెళ్లి ఆహ్వానపత్రిక అందజేసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆ ఫోటోలను రితేష్‌ అగర్వాల్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు.  

మరిన్ని వార్తలు