ఏపీ, తెలంగాణల్లో అడుగు పెడుతున్న ఎస్‌ఎల్‌సీఎం

8 Apr, 2022 20:34 IST|Sakshi

వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, మార్కెటింగ్ రంగాల్లో ఉత్తర భారత దేశంలోనే సేవలు అందిస్తోన్న సోహాన్‌లాల్‌ కమోడిటీ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిలెడ్‌ (ఎస్‌ఎల్‌సీఎం) సంస్థ దక్షిణ భారత దేశంలో తమ వ్యాపార కార్యకలాపాలు విస్తరించనుంది. అందులో భాగంగా త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ ఎత్తున వ్యవసాయ ఉత్పత్తుల గోదాములు ప్రారంభించబోతున్నట్టు ఆ కంపెనీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ సాల్మాన్‌ ఉల్లా ఖాన్‌ తెలిపారు.  

ఉత్తర భారత దేశంలో ఎస్‌ఎల్‌సీఎం కంపెనీ ఆధ్వర్యంలో 7,500 గోదాములు ఉన్నాయని సాల్మాన్‌ ఉల్లాఖాన్‌ తెలిపారు. మన దేశంలో రైతులు మంచి ధర రాకపోయినా పంట ఉత్పత​‍్తులను తక్కువ ధరకే అమ్మేసుకుంటున్నారని.. అలా కాకుండా మంచి ధర వచ్చే వరకు మా గోదాముల్లో నిల్వ చేసుకోవచ్చారు. తమ గోదాముల్లో శాస్త్రీయ పద్దతుల్లో పంట ఉత్పత్తులను నిల్వ చేస్తామన్నారు. దీని వల్ల క్వాలిటీ చెడిపోదన్నారు. అంతేకాకుండా మంచి ధర వచ్చే వరకు రైతులకు బ్యాంకుల నుంచి రుణులు పొందేందుకు సహకారం అందిస్తామన్నారు. దీంతోపాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న బయ్యర్లకు రైతులకు మధ్య సంధానకర్తలుగా కూడా వ్యవహరిస్తామని వివరించారు. 

తెలుగు రాష్ట్రాల్లో వ్యాపార విస్తరణలో భాగంగా నిజామాబాద్‌, గుంటూరులో తొలి గోదాములు ఏర్పాటు చేస్తామని ఎస్‌ఎల్‌సీఎం చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ తెలిపారు. ఆ తర్వాత దశల వారీగా తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తామన్నారు. తమ సంస్థ అభివృద్ధి చేసిన అగ్రిరీచ్‌ మొబైల్‌ యాప్‌ రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వెల్లడించారు.


 

మరిన్ని వార్తలు