సోమవారం నుంచి తాజా గోల్డ్‌ బాండ్లు

26 Feb, 2022 06:14 IST|Sakshi

అందుబాటులో ఐదు రోజులు

ధర గ్రాముకు రూ.5,109  

ముంబై: సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల స్కీమ్‌ సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. ఐదు రోజుల పాటు (ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4వ తేదీ) అమల్లో ఉండే ఈ బాండ్‌ స్కీమ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)  సిరీస్‌లో పదవది. గ్రాము ధర రూ.5,109 అని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం జారీ చేసిన ప్రకటన పేర్కొంది. ఆన్‌లైన్‌లో కొనుగోలుకు గ్రాముకు రూ.50 డిస్కౌంట్‌ లభిస్తుంది. అంటే ఈ సందర్భంలో గ్రాము ధర రూ.5,059గా ఉంటుందన్నమాట. జనవరి 10 నుంచి 14వ తేదీ వరకూ అమలయిన తొమ్మిదివ  సిరీస్‌  జారీ ధర గ్రాముకు రూ.4,786 కావడం గమనార్హం.

ఎనిమిదవ సిరీస్‌ ధర రూ. 4,791. భారత ప్రభుత్వం తరఫున బాండ్లను ఆర్‌బీఐ జారీ చేస్తుంది. స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌హెచ్‌సీఐఎల్‌), నిర్దిష్ట పోస్టాఫీసులు, బ్యాంకులు, స్టాక్‌ ఎక్సే్ఛంజీలు– ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల్లో గోల్డ్‌ బాండ్లు లభ్యం అవుతాయి. భౌతికంగా బంగారం కొనుగోళ్లు తగ్గించడం, తద్వారా దేశంపై దిగుమతుల బిల్లు భారంగా మారకుండా చూడ్డం లక్ష్యంగా 2015 నవంబర్‌లో సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ను కేంద్రం ప్రకటించింది. సబ్‌స్క్రిప్షన్‌ పీరియడ్‌కు ముందు వారంలోని చివరి మూడు పనిదినాల్లో ఇండియా బులియన్‌ అండ్‌ జువెలర్స్‌ అసోసియేషన్‌ ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం సాధారణ సగటు ముగింపు ధర ఆధారంగా బాండ్‌ ధర నిర్ణయమవుతుంది. 

మరిన్ని వార్తలు