స్టార్టప్‌లలో మహిళల హవా 

8 Mar, 2023 00:48 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గతంలో పురుషులకు మాత్రమే పరిమితమైన దేశీ స్టార్టప్‌ రంగంలో ఇప్పుడు మహిళలు దూసుకెళుతున్నారు. కొంగొత్త ఆవిష్కరణలతో అంకుర సంస్థలను విజయవంతంగా నడిపిస్తున్నారు. టెక్నాలజీ, ఈ–కామర్స్, ఫైనాన్స్‌ తదితర రంగాల్లో రాణిస్తున్నారు. మహిళల సారథ్యంలోని నైకా, జివామి, షీరోస్‌ వంటి పలు విజయవంతమైన అంకుర సంస్థలు ఇందుకు నిదర్శనం. ఫల్గుణీ నాయర్‌ నేతృత్వంలోని ఫ్యాషన్‌ ప్రొడక్ట్స్‌ సంస్థ నైకా... సంచలన స్థాయిలో స్టాక్‌ ఎక్స్చేంజీల్లో లిస్టయ్యింది. ఇన్వెస్టర్లు భారీగా ఎగబడి మరీ షేర్లు కొన్నారు.

ఇక అంతకన్నా ముందు ..  దాదాపు నలభై ఏళ్ల క్రితం రజని బెక్టర్‌ ఏర్పాటు చేసిన బేకరీ ఉత్పత్తుల సంస్థ మిసెస్‌ బెక్టర్స్‌ లిస్టింగ్‌కు వస్తే ఇన్వెస్టర్లు బ్రహ్మరథం పట్టారు.  ఇలాంటి సానుకూల స్పందన ఊతంతో మరిన్ని స్టార్టప్‌లు కూడా లిస్టింగ్‌ బాట పడుతున్నాయి. గజల్‌ అలగ్‌ సహ–వ్యవస్థాపకురాలిగా ఉన్న ఆరోగ్య ఉత్పత్తుల సంస్థ మామాఎర్త్‌ కూడా తాజాగా ఐపీవో యత్నాల్లో ఉంది. ఇలా పలు అంకుర సంస్థలు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు మహిళలకు అవసరమైన ఉత్పత్తులు, సర్విసులను అందించడంపై ప్రధానంగా దృష్టి పెట్టేవిగా ఉంటున్నాయి.

2014లో చిన్న, మధ్య తరహా వ్యాపారాలు సహా దేశీయంగా మహిళల సారథ్యంలోని స్టార్టప్‌ల సంఖ్య .. మొత్తం అంకుర సంస్థల్లో 8 శాతంగా ఉండేది. ప్రస్తుతం ఇది దాదాపు 14 శాతానికి చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పురుషుల సారథ్యంలోని అంకుర సంస్థలతో పోలిస్తే మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌లు 2.5 రెట్లు ఎక్కువగా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాయని, పెట్టుబడులపై 35 శాతం అధికంగా రాబడులు అందించగలుగుతున్నాయని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. 

లక్ష్యంపైనే గురి.. 
వ్యాపారాన్ని ప్రారంభించడమంటే అనేక సవాళ్లతో కూడుకున్న వ్యవహారం కావడంతో పాటు మిగతా వర్గాల నుంచి సహకారం లభించడం కూడా కీలకం.  వ్యాపారం ప్రారంభించడానికి ముందే టార్గెట్‌ మార్కెట్, పోటీ, తాము అందించే సర్వీసులు, ఉత్పత్తుల ప్రత్యేకత వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన ఉండాలని స్పేస్‌మంత్ర వ్యవస్థాపకురాలు నిధి అగర్వాల్‌ పేర్కొన్నారు. మహిళా ఎంట్రప్రెన్యూర్లు మరింత తరచుగా తమ నిర్ణయాలను ప్రశ్నించుకుంటూ ముందుకు సాగాల్సి వస్తుందని టెరావిటా వ్యవస్థాపకురాలు రాహీ అంబానీ తెలిపారు. అయితే, ఒడిదుడుకులను అధిగమించి, లక్ష్యంపైనే దృష్టి పెడితే విజయం సాధించవచ్చని ఆమె పేర్కొన్నారు. 

ప్రభుత్వాల తోడ్పాటు.. 
స్టార్టప్‌ రంగంలోనూ మహిళలు రాణించేలా ప్రభుత్వాలు, వివిధ సంస్థలు తోడ్పాటు అందిస్తుండటం కూడా వారికి సహాయకరంగా ఉంటోంది. అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్, స్టాండప్‌ ఇండియా వంటి స్కీములు స్టార్టప్‌లకు అండగా ఉంటున్నాయి. నిధులపరంగాను, ఇతరత్రా సహాయాన్ని అందించేందుకు యాక్సిలరేటర్లు, ఇన్‌క్యుబేటర్లు మొదలైనవి ఉన్నాయి. 

ఏడబ్ల్యూఎస్‌ నుంచి యాక్సెలరేట్‌హర్‌ 2023 
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెజాన్‌ వెబ్‌ సర్విసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌), ప్రముఖ వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ లైట్‌స్పీడ్‌ కలిసి యాక్సెలరేట్‌హర్‌ 2023 పేరిట ప్రత్యేక ప్రోగ్రాంను ఆవిష్కరించాయి. ప్రారంభ స్థాయి దేశీ స్టార్టప్‌ల మహిళా వ్యవస్థాపకులు తమ సంస్థలను నిర్మించుకునేందుకు, వృద్ధిలోకి తెచ్చుకునేందుకు, విజయవంతమైన వ్యాపారాలుగా తీర్చిదిద్దుకునేందుకు అవసరమైన తోడ్పాటు దీని ద్వారా పొందవచ్చు.

ఈ ఆరు వారాల యాక్సిలరేషన్‌ ప్రోగ్రామ్‌నకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఏడబ్ల్యూఎస్‌ ఇండియా హెడ్‌ (స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌) అమితాబ్‌ నాగ్‌పాల్‌ తెలిపారు. దీనికి ఎంపికైన స్టార్టప్‌లు నిధుల సమీకరణ, సాంకేతిక అంశాలపరమైన మద్దతు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. కనీస లాభదాయకత ఉత్పత్తి కలిగి ఉండి, మూడు మిలియన్‌ డాలర్ల కన్నా తక్కువ నిధులను సమీకరించిన స్టార్టప్‌లు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.  
  

ఫండ్‌ మేనేజర్లలో 10 శాతమే..
గడిచిన కొన్నేళ్లుగా మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమలో మహిళల మేనేజర్ల సంఖ్య పెరుగుతున్నా ఇప్పటికీ అది సుమారు 10% స్థాయిలోనే ఉన్నట్లు మారి్నంగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ ఇండియా వార్షిక నివేదిక పేర్కొంది. దీని ప్రకారం మహిళా ఫండ్‌ మేనేజర్ల సంఖ్య గతేడాది 32గా ఉండగా ప్రస్తుతం 42కి పెరిగింది.

అదే సమయంలో మొత్తం ఫండ్‌ మేనేజర్ల సంఖ్య 399 నుంచి 428కి చేరింది. వీరిలో 42 మంది మహిళలు.. ఫండ్స్‌ను ప్రైమరీ లేదా సెకండరీ మేనేజర్లుగా నిర్వహిస్తున్నారు. 2017లో 18 మందికి పరిమితమైన ఫండ్‌ మేనేజర్ల సంఖ్య ఆ తర్వాత నుంచి క్రమంగా పెరిగినట్లు మార్నింగ్‌స్టార్‌ పేర్కొంది. ప్రస్తుతం  24 ఫండ్‌ సంస్థల్లో 42 మంది మహిళా  మేనేజర్లు ఉన్నారు. 


మహిళా మాసంగా మార్చి .. ఐసీఐసీఐ లాంబార్డ్‌ 
ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో మహిళలకు సాధికారత కల్పించే ప్రయత్నాల్లో భాగంగా మార్చి నెలను మహిళా మాసంగా పాటిస్తున్నట్లు ప్రైవేట్‌ రంగ బీమా సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్‌ వెల్లడించింది. ఈ సందర్భంగా కాంప్లిమెంటరీ హెల్త్‌ చెకప్‌లను అందిస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన ప్రాంతాల్లోనూ ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ (ముందుగా వచ్చిన వారికి) ప్రాతిపదికన 10,000 మంది మహిళలకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వివరించింది.

దీని కింద థైరాయిడ్‌ ప్రొఫైల్, విటమిన్‌ డీ, బీ12 తదితర టెస్టులను నిర్వహిస్తారు. అలాగే మహిళా మోటరిస్టులకు కాంప్లిమెంటరీగా రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ సర్వీసులు అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఇక మహిళా ఎంట్రప్రెన్యూర్‌íÙప్‌ను ప్రోత్సహించే దిశగా మహిళా ఏజెంట్లను రిక్రూట్‌ చేసుకునేందుకు, అవగాహన కల్పించేందుకు సమగ్ర శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్లు కంపెనీ ఈడీ సంజీవ్‌ మంత్రి పేర్కొన్నారు. 

మహిళల కోసం సిగ్నిటీ ప్రత్యేక కార్యక్రమాలు 
టెక్నాలజీ రంగంలో మహిళలకు తోడ్పాటునిచ్చే దిశగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిగ్నిటీ టెక్నాలజీస్‌ సంస్థ వెల్లడించింది. మార్చి 9న ’ఉమెన్‌ ఇన్‌ టెక్‌ రౌండ్‌టేబుల్‌’ వర్చువల్‌ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపింది. పలు మహిళా దిగ్గజాలు పాల్గొనే ఈ చర్చాగోష్టికి సంస్థ ఎస్‌వీపీ శిరీష పెయ్యేటి సారథ్యం వహిస్తారు.

అలాగే, మహిళలు కొత్త విషయాలను నేర్చుకునేలా, అనుభవజ్ఞులు నుంచి సలహాలు పొందేలా వెసులుబాటు కల్పించే దిశగా ’హర్‌డిజిటల్‌స్టోరీ’ పేరిట ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందిస్తున్నట్లు సిగ్నిటీ పేర్కొంది. ఇక కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఎంఎన్‌జే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీతో కలిసి పనిచేస్తున్నట్లు, ’ప్రాజెక్ట్‌ సిగ్నిఫికెన్స్‌’ పేరిట 100 మంది గ్రామీణ ప్రాంత మహిళలకు డిజిటల్‌ నైపుణ్యాల్లో శిక్షణ కల్పిస్తున్నట్లు వివరించింది.  

మరిన్ని వార్తలు