న్యూఢిల్లీ: రియల్టీ రంగంలో డేటా ఇంటెలిజెన్స్ సేవలందిస్తున్న ప్రాప్స్ఏఎంసీని కొనుగోలు చేసినట్లు ప్రాపర్టీ, గృహ రుణ బ్రోకింగ్ కంపెనీ స్క్వేర్ యార్డ్స్ తాజాగా పేర్కొంది. ఈ కొనుగోలులో భాగంగా ప్రాప్స్ఏఎంసీకి చెందిన సహవ్యవస్థాపకులతోసహా మొత్తం టీమ్ తమ సంస్థలో భాగంకానున్నట్లు తెలియజేసింది. అయితే ప్రాప్స్ఏఎంసీ సొంత బ్రాండుతోనే ఇకపైనా కొనసాగనున్నట్లు తెలియజేసింది. డీల్ విలువను వెల్లడించలేదు.
డేటా ఇంటెలిజెన్స్, అసెట్ మేనేజ్మెంట్ తదితర రియల్ ఎస్టేట్ సర్వీసులందిస్తున్న ప్రాప్స్ఏఎంసీని 2016లో ఆనంద్ మూర్తి, వెంకట్ రాఘవన్ ఏర్పాటు చేశారు. ఎస్ఏఏఎస్(సాస్) ఆధారిత ప్లాట్ఫామ్ ద్వారా 1.5 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 11,000 కోట్లు) విలువైన రియల్టీ ఆస్తులను నిర్వహణను చేపడుతోంది. కాగా.. ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్క్వేర్ యార్డ్స్ 2014 నుంచి ఇప్పటివరకూ 5 కోట్ల డాలర్ల(సుమారు రూ. 360 కోట్లు) నిధులను సమీకరించింది. అక్టోబర్–డిసెంబర్ కాలంలో 12 శాతం అధికంగా రూ. 89 కోట్ల ఆదాయం సాధించింది. స్థూల లాభం 13 శాతం పెరిగి రూ. 33 కోట్లకు చేరువైంది.