Colombo Stock Exchange: సంక్షోభంతో బెంబేలెత్తిన ఇన్వెస్టర్లు.. ఆకస్మాత్తుగా కొలంబో మార్కెట్‌ క్లోజ్‌

4 Apr, 2022 11:50 IST|Sakshi

గత ఆర్నెళ్లుగా శ్రీలంక దేశాన్ని చుట్టుముట్టి పీడిస్తున్న ఆర్థిక కష్టాలు ఒక్కో వ్యవస్థను దెబ్బతీస్తు‍న్నాయి. ఇప్పటికే ఆహార, చమురు , విద్యుత్‌, విదేశీ ద్రవ్య లభ్యత వంటి కష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఆ దేశానికి తాజాగా మరో షాక్‌ తగిలింది. సోమవారం శ్రీలంక స్టాక్‌ మార్కెట్‌ మూతపడింది.

సోమవారం శ్రీలంకలోని కోలంబో స్టాక్‌ మార్కెట్‌ ప్రారంభైమన నిమిషాల వ్యవధిలోనే ప్రధాన కంపెనీలను ప్రతిబింబించే సూచీలు దాదాపు 6 శాతం నష్టపోయాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు మార్కెట్‌ మరింతగా క్రాష్‌ అవకుండా నిరోధించేందుకు చర్యలు చేపట్టారు. కొలంబో మార్కెట్‌ను మూసేస్తున్నట్టు ప్రకటించారు.

ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరుకోవడంతో శ్రీలంక పౌరులు ఆందోళన బాట పట్టారు. ఆ దేశ అధ్యక్షుడు, ప్రధానితో పాటు కీలక పదవుల్లో ఉన్న వారు రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. శ్రీలంక వ్యాప్తంగా అల్లర్లు కొనసాగుతున్నాయి. దీంతో సోమవారం శ్రీలంక కేబినేట్‌ రాజీనామా సమర్పించింది. 

కేబినేట్‌ రాజీనామా నిర్ణయంతో అప్పటి వరకు ఏ మూలనో మిణుకుమిణుకు మంటున్న ఆశలు పూర్తిగా సన్నగిల్లిపోవడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకునేందుకు పోటీ పడ్డారు. ఫలిగంగా క్షణాల్లో మార్కెట్‌ 5.9 శాతం క్షీణించింది. మరింత నష్టం వాటిల్లకుండా కొలంబో మార్కెట్‌ను క్లోజ్‌ చేశారు.

చదవండి: లంకలో ప్రజా వ్యతిరేకత: కేంద్ర కేబినెట్‌ రాజీనామా..

మరిన్ని వార్తలు