భారత్‌ దెబ్బకు..కిందకు దిగొచ్చిన ఎలన్‌ మస్క్‌ కంపెనీ..!

4 Jan, 2022 15:45 IST|Sakshi

స్టార్‌లింక్‌ ద్వారా​ ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలను ప్రవేశపెట్టాలని భావించిన టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలన్‌మస్క్‌కు గత నెలలో మనదేశంలో గట్టి షాక్ తగిలిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భారతదేశంలో స్టార్‌లింక్‌ ప్రీ బుకింగ్ ఆర్డర్స్ తీసుకోవడం నిలిపివేసిన తర్వాత ఇప్పుడు ప్రీ బుకింగ్ కోసం గతలో యూజర్ల వసూలు చేసిన డబ్బులను తిరగి ఖాతాలో జమ చేస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 2020లో శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ కంపెనీ స్టార్‌లింక్‌ వినియోగదారుల నుంచి ప్రీ ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించింది. ప్రీ బుకింగ్ ఆర్డర్లు 99 డాలర్ల ధరకు లభ్యం అయ్యాయి. 

మన దేశంలో ఈ శాటిలైట్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ సేవల అందించడం కోసం ప్రీ బుకింగ్ పేరుతో రూ.7300లను స్టార్‌లింక్‌ వసూలు చేసింది. లైసెన్స్‌ తీసుకోకుండా స్టార్‌లింక్‌ వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం నేరం అని టెలికమ్యూనికేషన్స్ విభాగం(డీఓటీ) సంస్థను హెచ్చరించడంతో స్టార్ లింక్ నవంబర్ 2021లో భారతదేశంలో ప్రీ బుకింగ్ ఆర్డర్లను తీసుకోవడం నిలిపివేసింది. దీంతో భారత్‌లో స్టార్‌లింక్‌ సేవలను అందించేందుకుగాను వాణిజ్య లైసెన్స్ కోసం ఈ ఏడాది జనవరి 31లోపు దరఖాస్తు చేసుకోనుందని స్టార్‌లింక్‌ ఇండియా హెడ్ సంజయ్‌ భార్గవ్ లింక్డ్‌ఇన్‌లో గతంలో పేర్కొన్నారు. 

అక్టోబర్ 1, 2021 నాటికి భారతదేశంలో ఈ సేవల ఇప్పటికే 5000కు పైగా ప్రీ ఆర్డర్లు అందినట్లు కంపెనీ ప్రకటించింది. భారతదేశంలో లైసెన్స్ పొందే వరకు ప్రీ ఆర్డర్ల రూపంలో తీసుకున్న డబ్బును రీఫండ్ చేయాలని డీఓటీ ఆదేశించినట్లు స్టార్‌లింక్‌ భారతదేశంలోని కస్టమర్లకు ఈ-మెయిల్ చేసినట్లు సమాచారం. భారతదేశంలో స్టార్‌లింక్‌ సేవలు అందించడానికి ముందు పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని కంపెనీ హైలైట్ చేసినట్లు ఒక ప్రముఖ మీడియా నివేదించింది. దేశంలో ఉపగ్రహ ఆధారిత సేవలను అందించడానికి భారత ప్రభుత్వం నుంచి అవసరమైన లైసెన్స్(లు) తీసుకోవాలని డీఓటి ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

(చదవండి: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో దుమ్ములేపుతున్న టాటా మోటార్స్..!)

మరిన్ని వార్తలు