గెలుపు బాటలో మరో స్టార్టప్‌.. ఓఫోర్‌ఎస్‌లోకి పెట్టుబడుల వరద

26 Oct, 2021 11:37 IST|Sakshi

న్యూఢిల్లీ: బిజినెస్‌కి సంబంధించి సప్లై చైయిన్‌ వ్యవస్థలో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) ఆధారంగా సేవలు అందిస్తోన్న ఓఫోర్‌ఎస్‌ (O4S) సంస్థ ఉత్తర అమెరికా, ఆగ్నేయాసియా దేశాలకు తమ సేవలను విస్తరించనుంది. ఇటీవల ఓఫోర్‌ఎస్‌లో పెట్టుబడులు పెట్టేందుకు థింక్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, వెంచర్‌హైవే వంటి సంస్థలు ముందుకు వచ్చాయి. మొత్తంగా 6 మిలియన్‌ డాలర్లను (రూ. 45 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించారు. అంతకు ముందు జరిగిన చర్చల్లో రూ. 25 కోట్ల పెట్టుబడులు ఈ సంస్థలోకి వచ్చాయి. భారీ మొత్తంలో నిధులు రావడంతో విస్తరణ బాటలో ఉంది ఓఫోర్‌ఎస్‌ సంస్థ.

దివయ్‌ కుమార్‌, శ్రేయస్‌ సిపానీలు ఓఫోర్‌ఎస్‌ని 2017లో స్టార్టప్‌గా ప్రారంభించారు. ప్రధాన కార్యాలయం గురుగ్రామ్‌లో ఉండగా బెంగళూరు, హైదరాబాద్‌లలో రీజనల్‌ సెంటర్లు ఉన్నాయి. ఇప్పటికే ఈ సంస్థకు కష్లమర్లుగా ఐటీసీ, కోకకోల, హనీవెల్‌, ఆక్‌జోనోబెల్‌, మెండల్‌లెజ్‌ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సప్లై చెయిన్‌కి సంబంధించి 500లకు పైగా సంస్థలు ఓఫోర్‌ఎస్‌కి సంబంధించిన ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, మెషిన్‌లెర్నింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌లతో పాటు ఎస్‌ఏఏఎస్‌ (SaaS) సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగిస్తున్నాయి. ఇటీవల ఫోర్బ్స్‌ ప్రకటించిన ఏషియన్‌ అండర్‌ 30 ఎంట్రప్యూనర్స్‌ జాబితాలో దివయ్‌ కుమార్‌, శ్రేయస్‌ సిపానీలు చోటు దక్కించుకున్నారు.
 

మరిన్ని వార్తలు