భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

5 Apr, 2021 16:12 IST|Sakshi

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు(ఏప్రిల్ 5) భారీ నష్టాలతో ముగిసాయి. అంతర్జాతీయ ప్రతికూల సంతకేతాలతో తోడు, దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ, లాక్‌డౌన్‌ కారణాల రీత్యా సోమవారం కీలక సూచీలు భారీ నష్టాల్లో ముగిసాయి. ఉదయమే ప్రతికూలంగా ప్రారంభమైన మార్కెట్లు సమయం గడుస్తున్నకొద్దీ అంతకంతకూ దిగజారాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన తొలి రెండు గంటల్లో బీఎస్‌ఈ నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువలో దాదాపు రూ.4.5 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. నేడు సెన్సెక్స్ 870.51 పాయింట్లు(1.74 శాతం) కోల్పోయి 49,159.32 వద్దకు చేరుకోగా, నిఫ్టీ 229.55 పాయింట్లు కుప్పకూలి (1.54 శాతం) 14,637.80 వద్ద ముగిసింది. 

డాలరుతో రూపాయి మారకం విలువ 73.33 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్లు మూడు శాతానికి పైగా నష్టపోయాయి. విప్రో, బ్రిటానియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐషర్‌ మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి. కరోనా సెకండ్‌వేవ్‌ ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి క్రమం పటిష్టంగానే ఉందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ నోమురా తెలిపింది. అయితే లాక్‌డౌన్‌, పెరిగిన ఆంక్షల నేపథ్యంలో క్యూ2 జీడీపీని ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.

చదవండి:

కొత్త ఇళ్లు కొనే వారికి ఎస్‌బీఐ షాక్!

మరిన్ని వార్తలు