ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు రికార్డు స్థాయిలో ముగిశాయి. స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. టెలికాం రంగంలోకి 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించడంతో ఆ రంగం షేర్ల దూసుకెళ్లాయి. టెలికామ్ రంగం, బ్యాంకింగ్ రంగం అండతో ఇంట్రాడే సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్టస్థాయి 59,204.29 పాయింట్లను తాకగా, నిఫ్టీ గరిష్టస్థాయి 17,644.60 పాయింట్లను తాకింది. ముగింపులో, సెన్సెక్స్ 418 పాయింట్లు (0.71 శాతం) లాభపడి 59,141.16 వద్ద ఉంటే, నిఫ్టీ 110 పాయింట్లు(0.63 శాతం) పెరిగి 17,629.50 పాయింట్ల వద్ద స్థిర పడింది.
నేడు డాలరుతో రూపాయి మారకం విలువ 73.56గా నమోదైంది. నిఫ్టీలో ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐటీసీ లిమిటెడ్, ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు భారీగా లాభపడితే.. భారత్ పెట్రోలియం, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ, టాటా స్టీల్, శ్రీ సిమెంట్స్ షేర్లు నష్టాలను చవిచూశాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఇండెక్స్ 5.43 శాతం, ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 2.67 శాతం లాభాన్ని సాధించింది. అలాగే మీడియా ఇండెక్స్ 1.71 శాతం, మెటల్, ఐటీ సూచీలు ఒక్కొక్కటి 0.62 శాతం పడిపోయాయి.