ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు (సెప్టెంబర్ 17) నష్టాలతో ముగిశాయి. వరుసగా మూడు రోజులు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరకు నష్టాల్లోకి జారుకున్నాయి. దేశీయ సానుకూల సంకేతాలతో జీవనకాల గరిష్ఠాలకు చేరుకున్న సూచీలు మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా పడిపోయాయి. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడటంతో సూచీలు మధ్యాహ్నం నుంచి నష్టాల్లోకి జారుకున్నాయి. చివరకు, సెన్సెక్స్ 125 పాయింట్లు(0.21 శాతం) క్షీణించి 59,015.89 వద్ద ఉంటే, నిఫ్టీ 44 పాయింట్లు (0.25 శాతం) నష్టపోయి 17,585.15 వద్ద ముగిసింది.
నేడు డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 73.48 వద్ద ముగిసింది. నేడు కోటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, మారుతీ, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఆటో, ఐటీసీ షేర్లు భారీగా లాభపడితే.. టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్యూఎల్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, టీసీఎస్, రిలయన్స్ షేర్లు నష్టపోయాయి.