Stock Market Updates Live: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. గత మూడు రోజులుగా సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్న నేపథ్యంలో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఉదయం 10:10 గంటల సమయంలో సెన్సెక్స్ 295 పాయింట్ల లాభంతో 60,215 వద్ద.. నిఫ్టీ 96 పాయింట్ల లాభంతో 17,970 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.37 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఆటో తప్ప మిగిలిన షేర్లన్నీ లాభాల్లో ట్రేడవుతుండడం విశేషం. నెస్లే ఇండియా, సన్ఫార్మా, టాటా స్టీల్, మారుతీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్ షేర్ల విలువ పెరిగింది.
ఇక అంతర్జాతీయంగా ఉన్న ప్రతికూల సంకేతాలు దేశీయ సూచీలను కొంతమేర కలవరపరుస్తున్నాయి. ద్రవ్యోల్బణ భయాలతో గురువారం అమెరికా మార్కెట్ సూచీలు మిశ్రమంగా ముగిశాయి. అక్కడి ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్ఠానికి చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు బంగారం ధరలు సైతం 5 నెలల గరిష్ఠానికి చేరాయి. డాలర్ ఇండెక్స్ కూడా 16 నెలల గరిష్ఠం వద్ద ట్రేడవుతోంది. ఇక ఆసియా పసిఫిక్ సూచీలు నేడు మిశ్రమంగా కదలాడుతున్నాయి.