కొత్త గరిష్టాల వద్ద ముగింపు

17 Nov, 2022 09:13 IST|Sakshi

ముంబై: ట్రేడింగ్‌లో పరిమితి శ్రేణిలో కదలాడిన సూచీలు బుధవారం కొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్స్‌ షేర్లు రాణించడంతో ఇంట్రాడేలోనూ తాజా ఏడాది గరిష్టాలను నమోదుచేశాయి. సెన్సెక్స్‌ ఉదయం 164 నష్టంతో 61,709 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 180 పాయింట్లు బలపడి  62,053 వద్ద కొత్త ఏడాది గరిష్టాన్ని తాకింది. అలాగే 61,709 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

చివరికి 108 పాయింట్ల పెరిగి కొత్త జీవితకాల గరిష్టం 61,981 వద్ద స్థిరపడింది. నిఫ్టీ  రోజంతా 98 పాయింట్ల పరిధిలో కదలాడి 18,442 వద్ద 52 వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 6 పాయింట్ల అతి స్వల్ప లాభంతో 18,410 వద్ద ముగిసింది. ఆటో, మీడియా, మెటల్, ఫార్మా, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.386 కోట్లను షేర్లను అమ్మేశా రు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1437 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియా, యూరప్‌ మార్కెట్లు, యూఎస్‌ స్టాక్‌ ఫ్యూచర్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 35 పైసలు బలహీనపడి 81.26 స్థాయి వద్ద స్థిరపడింది. 

మార్కెట్లో మరిన్ని సంగతులు  
► మేదాంతా బ్రాండ్‌ పేరుతో హాస్పిటల్స్‌ చైన్‌ నిర్వహిస్తున్న గ్లోబల్‌ హెల్త్‌ ఐపీవో లిస్టింగ్‌ మెప్పించింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర రూ.336తో పోలిస్తే 18% ప్రీమియంతో రూ.398 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 26% ర్యాలీ చేసి రూ.425 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మార్కెట్‌ ముగిసేసరికి 23 శాతం బలపడి రూ.416 వద్ద స్థిరపడింది. 
►  బికాజీ ఫుడ్స్‌ ఇంటర్నేషనల్‌ ఐపీవో సైతం విజయవంతమైంది. ఇష్యూ ధర రూ.300తో పోలిస్తే 7% ప్రీమియంతో రూ.321 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 12% రూ.335 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 6% పెరిగి రూ.317 వద్ద స్థిరపడింది.

యాక్సిస్‌ వాటాకు రూ. 3,839 కోట్లు
ఎస్‌యూయూటీఐ ద్వారా ప్రయివేట్‌ రంగ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌లోగల 1.5 శాతం వాటాను ప్రభుత్వం విక్రయించింది. షేరుకి రూ. 830.63 ఫ్లోర్‌ ధరలో గత వారం ప్రభుత్వం 4.65 కోట్లకుపైగా యాక్సిస్‌ షేర్లను విక్రయించింది. వెరసి రూ. 3,839 కోట్లు అందుకున్నట్లు దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే తాజాగా ట్వీట్‌ చేశారు. దీంతో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ. 28,383 కోట్లను సమకూర్చుకున్నట్లు వెల్లడించారు.

చదవండి: IT Layoffs 2022: ‘నా ఉద్యోగం ఉంటుందో..ఊడుతుందో’..టెక్కీలకు చుక్కలు చూపిస్తున్న కంపెనీలు!

మరిన్ని వార్తలు