మార్కెట్‌ ముందుకే

12 Oct, 2020 04:56 IST|Sakshi

అమెరికా ఉద్దీపన ప్యాకేజీపై ఆశలు 

భారత్‌లో కూడా ప్యాకేజీ ఉంటుందని అంచనాలు 

కంపెనీల క్యూ2 ఫలితాలపై ఆశావహం 

మార్కెట్‌ ర్యాలీ కొనసాగుతుందంటున్న నిపుణులు 

పై స్థాయిల్లో స్వల్ప లాభాల స్వీకరణ ఉండొచ్చని సూచన

స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీ స్వల్ప కాలం మేర కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  అమెరికా (భారత్‌లో కూడా) ఉద్దీపన ప్యాకేజీపై ఆశలు, కంపెనీల క్యూ2 ఫలితాలు బాగా ఉంటా యనే అంచనాలు  దీనికి ప్రధాన కారణాలని వారంటున్నారు. ఇక ఈ వారంలో వెలువడనున్న ఐటీ కంపెనీల ఫలితాలు, ద్రవ్యోల్బణ, పారిశ్రామికో త్పత్తి గణాంకాలు, మారటోరియం రుణాలపై వడ్డీ మాఫీపై సుప్రీం కోర్టు తీర్పు.. మార్కెట్‌ గమనాన్ని నిర్దేశిస్తాయని  విశ్లేషకులు అంటున్నారు. వీటితో పాటు కరోనా కేసులు, వ్యాక్సిన్‌ సంబంధిత వార్తలు, డాలర్‌తో రూపాయి మారకం  కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ సంకేతాల  ప్రభావం కూడా ఉంటుందని వారంటున్నారు.

70 కంపెనీల క్యూ2 ఫలితాలు....
ఈ వారంలోనే విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, మైండ్‌ ట్రీ వంటి ఐటీ  కంపెనీల ఫలితాలు  వెలువడతాయి. వీటితో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అవెన్యూ సూపర్‌ మార్ట్, ఫెడరల్‌ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్‌... మొత్తం 70  కంపెనీలు తమ తమ క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. నేడు (సోమవారం) మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్, యూటీఐ ఏఎమ్‌సీ, లిఖిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీల షేర్లు స్టాక్‌ మార్కెట్లో లిస్టవుతాయి. ఇదే రోజు ఆగస్టు నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, సెప్టెంబర్‌ నెల రిటైల్‌ ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. బుధవారం (ఈ నెల 14న ) టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడుతాయి. వరుసగా ఏడు రోజుల పాటు మార్కెట్‌ పెరిగినందున పై స్థాయిల్లో స్వల్ప లాభాల స్వీకరణ ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.  

ఈ నెలలో 1,000 కోట్ల విదేశీ నిధులు....
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) మన మార్కెట్లో ఈ నెలలో రూ.1,086 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. ఇప్పటివరకూ వెల్లడైన కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలను  మించడం,  జీఎస్‌టీ వసూళ్లు మెరుగుపడటం, ఆర్థిక పరిస్థితులు పుంజుకున్నాయని గణాంకాలు వెల్లడించడం, సానుకూల అంతర్జాతీయ సంకేతాలు దీనికి కారణాలు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్‌మార్కెట్లో రూ.5,245 కోట్లు ఇన్వెస్ట్‌ చేయగా, డెట్‌ మార్కెట్‌ నుంచి రూ.4,159 కోట్లు ఉపసంహరించుకున్నారు. కాగా సెప్టెంబర్‌ నెల మొత్తం మీద నికరంగా రూ.3,419 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు.

>
మరిన్ని వార్తలు