స్ట్రైడ్స్‌ ఫార్మా- జీఎంఎం ఫాడ్లర్‌ హైజంప్‌

29 Sep, 2020 14:46 IST|Sakshi

7 శాతం జంప్‌చేసిన స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌

తాజాగా 52 వారాల గరిష్టాన్ని తాకిన షేరు

జీఎంఎం ఫాడ్లర్‌- 2 వారాల నష్టాలకు చెక్‌

5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకిన షేరు

కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌ కౌంటర్‌ మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోపక్క ఇటీవల పతన బాటలో సాగుతున్న ఇంజినీరింగ్‌ కంపెనీ జీఎంఎం ఫాడ్లర్‌ కౌంటర్‌కు ఉన్నట్టుండి డిమాండ్‌ పుట్టింది. దీంతో మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటలో హెచ్చుతగ్గులను చవిచూస్తున్నప్పటికీ ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌
గత వారం రోజుల్లో 14 శాతం ర్యాలీ చేసిన స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌ కౌంటర్‌ మరోసారి వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో తొలుత ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 7 శాతం జంప్‌చేసి రూ. 755ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 3.6 శాతం ఎగసి రూ. 733 వద్ద ట్రేడవుతోంది. ఆందోళనవల్ల తలెత్తే తల నొప్పి నివారణలో వినియోగించగల ట్యాబ్లెట్లకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతి పొందిన తదుపరి ఈ కౌంటర్‌ జోరందుకున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఎక్టావిస్‌ ల్యాబొరేటరీకి చెందిన బ్యుటల్‌బిటల్, ఎసిటామినోఫిన్‌, కెఫీన్‌ ట్యాబ్లెట్లకు జనరిక్‌ వెర్షన్‌ అయిన ట్యాబ్లెట్లకు అనుబంధ సంస్థ ద్వారా స్ట్రైడ్స్‌ ఫార్మా సైన్స్‌ యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతి పొందినట్లు పేర్కొన్నారు. దీనికితోడు ఈ ఏడాది క్యూ1లో పటిష్ట పనితీరు చూపడంతో గత మూడు నెలల్లో ఈ షేరు 77 శాతం దూసుకెళ్లింది.

జీఎంఎం ఫాడ్లర్‌
రెండు వారాలుగా పతన బాటలో సాగుతున్న జీఎంఎం ఫాడ్లర్‌ కౌంటర్‌కు ఉన్నట్టుండి డిమాండ్‌ ఏర్పడింది. దీంతో ఎన్‌ఎస్ఈలో యథాప్రకారం తొలుత 5 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకిన ఈ షేరు తదుపరి టర్న్‌అరౌండ్‌ అయ్యింది. కొనుగోలుదారులు పెరగడంతోపాటు.. అమ్మేవాళ్లు కరువుకావడంతో 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. వెరసి తొలుత నమోదైన ఇంట్రాడే కనిష్టం రూ. 3,433 నుంచి రూ. 3,794కు దూసుకెళ్లింది. ఇది 11 శాతం లాభంకాగా.. మార్కెట్‌ ధరతో పోలిస్తే భారీ డిస్కౌంట్‌లో ప్రమోటర్లు 17.6 శాతం వాటాను విక్రయానికి పెట్టిన నేపథ్యంలో కొద్ది రోజులుగా పతన బాటలో సాగుతోంది. వెరసి గత రెండు వారాల్లో ఈ షేరు 40 శాతం దిగజారింది. ఇటీవల ఓఎఫ్‌ఎస్‌ ద్వారా ప్రమోటర్లు షేరుకి రూ. 3,500 ధరలో  17.6 శాతం వాటాను విక్రయించనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు