-

40 అంతస్తులు..4 టన్నుల మందు గుండు..9 సెకన్లలో ట్విన్‌ టవర్స్‌ మాయం..!

15 Mar, 2022 15:50 IST|Sakshi

Supertech Twin Towers Demolition: నిబంధనలకు విరుద్ధంగా భవనాల నిర్మాణం చేపట్టిన సూపర్‌టెక్‌ లిమిటెడ్‌కి చెందిన ఎమరాల్డ్‌ కోర్ట్‌ ప్రాజెక్టు 40 అంతస్తుల ట్విన్‌ టవర్స్‌ భవనాలను మే 22 నాటికి కూల్చివేస్తామని నోయిడా అథారిటీ సుప్రీంకోర్టుకు తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ కూల్చివేత పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు అధికారులు కోర్టుకు తెలిపారు. కాగా తాజాగా కూల్చివేత పనులకు సంబంధించిన వివరాలను నోయిడా  అధికారులు వెల్లడించారు.   

9 సెకన్లలో మాయం..!
సుమారు 4 టన్నుల మందు గుండు సహాయంతో కేవలం 9 సెకన్లలో ట్విన్‌ టవర్స్‌ను నేలమట్టం చేస్తామని అధికారులు పేర్కొన్నారు. కోర్టులో పేర్కొన్న విధంగా కూల్చివేత పనులు జరుగుతాయని తెలిపారు. మే 22న మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో  ట్విన్‌ టవర్స్‌ను కూల్చివేస్తామని వెల్లడించారు. కాగా కూల్చివేత సమయంలో   టవర్స్‌కు సమీపంలోని సెక్టార్-93Aలో నివసిస్తున్న సుమారు 1,500 కుటుంబాలను ఐదు గంటల పాటు వారి ఇళ్ల నుంచి తరలించనున్నట్లు అధికారులు తెలిపారు . అంతేకాకుండా సైట్‌కు దగ్గరగా ఉన్న నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేను కూడా ఒక గంట పాటు మూపివేయబడుతుందని పేర్కొన్నారు.    

ఎడిఫైస్‌ నేతృత్వంలో..!
ట్విన్‌ టవర్స్‌ అపెక్స్‌, సెయాన్‌ భవనాలను ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థ కూల్చివేయనుంది. కూల్చివేత పనులకు సంబంధించిన వివరాలను సంస్థ ప్రతినిధులు తెలిపారు.ఈ కంపెనీ 2019లో దక్షిణాఫ్రికా జోహన్నెస్‌బర్గ్‌లో 108 మీటర్ల పొడవైన బ్యాంక్ ఆఫ్ లిస్బన్‌ను కూల్చివేసింది. కాగా కూల్చివేతకు అయ్యే ఖర్చులను పూర్తిగా మొత్తం బిల్డర్‌ భరించాలని కోర్టు ఆదేశించింది. 

కుమ్మక్కు..!
ట్విన్‌ టవర్స్‌ నిర్మాణంలో అధికారులు కూడా కుమ్మకునట్లు తెలుస్తోంది.  బిల్డర్‌తో కుమ్మక్కయిన నోయిడా అధికారులను ప్రాసిక్యూట్‌ చేయాలని కోర్టు ఆదేశించింది. బిల్డర్లు, నోయిడా అధికారుల కుమ్మక్కయిన విధానం ఈ కేసు రికార్డు చూస్తే అర్థం అవుతోందని, ప్రణాళికా విభాగం అధికారుల ఉల్లంఘన స్పష్టమవుతోందని పేర్కొంది. ఇక రెండు టవర్ల (టి–16, టి–17) ఫ్లాట్‌ యజమానులకు మొత్తం సొమ్ము 12 శాతం వడ్డీతోసహా తిరిగి చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

చదవండి: ట్విన్‌ టవర్స్‌ కూల్చోద్దు.. ఒక్కసారి మా మాట వినండి

మరిన్ని వార్తలు