10 మంది వ్యక్తిగత హామీలు రూ.1.6 లక్షల కోట్లు!

13 Jul, 2021 02:15 IST|Sakshi

కార్పొరేట్‌ రుణాలపై బ్యాంకింగ్‌కు ‘సుప్రీం’ భరోసా!

న్యూఢిల్లీ:  కంపెనీలకు రుణాల విషయంలో ఆయా సంస్థలతో పాటు వ్యక్తిగత గ్యారంటార్ల (హామీగా ఉన్నవారు)పైనా ఇన్సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్టీ కోడ్‌ (ఐబీసీ) ప్రకారం చర్యలు తీసుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం  సుప్రీంకోర్టు మే నెల్లో ఇచ్చిన తీర్పు ‘రికవరీ’ల విషయంలో బ్యాంకింగ్‌కు పెద్ద భరోసాను అందిస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. దాదాపు 10 మంది బడా కార్పొరేట్‌ వ్యక్తిగత హామీలే దాదాపు రూ.1.6 లక్షల కోట్లు  ఉండడం గమనార్హం.  కేంద్రం 2019 నవంబర్‌ 15న ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలుచేస్తూ, పారిశ్రామికవేత్త లలిత్‌ కుమార్‌ జైన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధానంగా తీసుకుని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు బ్యాంకింగ్‌ రుణ బకాయిల విషయంలో అస్త్రంగా మార్చుకోవడానికి తగిన ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.  

రికవరీ ఏర్పాట్లు 
2019 నవంబర్‌ 15 కేంద్రం నోటిఫికేషన్‌ను సమర్థిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అనంతరం కార్పొరేట్‌ వ్యక్తిగత హామీలపై బ్యాంకులు దృష్టి సారించినట్లు సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. రికవరీ ప్రక్రియకు ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు మరో బ్యాంకర్‌ వెల్లడించారు. మొండిబకాయిల (ఎన్‌పీఏ) నుంచి తమ వ్యక్తిగత హామీలను తొలగించాలని కోరుతూ కొందరు ప్రమోటర్లు ఫోన్‌కాల్స్‌ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించడం విశేషం. కొంతరు తమ వ్యక్తిగత సంపదను రక్షించుకోడానికి మొండిబకాయిల సమస్య పరిష్కరించుకోడానికి కూడా ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తుపై కూడా ఈ తీర్పు ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ఎగవేతలు తగ్గుతాయని బ్యాంకింగ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  

బడా ‘వ్యక్తిగత’ హామీల జాబితాలో... 
రిలయన్స్‌ గ్రూప్‌ చీఫ్‌ అనిల్‌ అంబానీ, దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌కు కార్పొరేషన్‌ అధిపతి కపిల్‌ వాధ్వాన్,  భూషన్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ హెడ్‌ సంజయ్‌ సింఘాల్, ఆయన భార్య ఆర్తి సింఘాల్‌ (భార్య భర్తల వ్యక్తిగత హామీలు దాదాపు రూ.24,550 కోట్లు),  వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. ఇక వీడియోకాన్‌కు రుణాల విషయంలో వేణుగోపాల్‌ ధూత్‌ వ్యక్తిగత హామీల విలువ దాదాపు రూ.22,000 కోట్లుగా ఉంది. 

సుప్రీం తీర్పు ఏమిటంటే... 
ఖాయిలా కంపెనీల పునరుద్ధరణ ప్రణాళికలకు ఆమోదముద్ర పడినప్పటికీ, ఐబీసీ నిబంధనావళి కింద చర్యల నుంచి హామీదారులు తప్పించుకోలేరని జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వర రావు, ఆర్‌ రవీంద్రలతో కూడిన ధర్మాసనం తన 82 పేజీల ఉత్పర్వు్యల్లో స్పష్టం చేసింది. అలాగే బడా కార్పొరేట్ల రుణాల విషయంలో ఉన్నత స్థాయి పారిశ్రామికవేత్తలు దివాలా చర్యలను ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది.  కంపెనీలతో పాటు గ్యారంటార్లమీదా నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్స్‌ (ఎన్‌సీఎల్‌టీ)ల్లో ఒకేసారి ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్‌ ప్రారంభించడానికి కూడా అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఇలాంటి ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ దాఖలైన దాదాపు 75 రిట్‌ పిటిషన్లు, ట్రాన్‌ఫర్డ్‌ కేసులు, ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్లు అన్నింటినీ తోసిపుచ్చుతున్నట్లు ధర్మాసనం  స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు