ఐపీవో బాటలో సర్వైవల్‌ టెక్‌

30 Dec, 2022 06:32 IST|Sakshi

రూ. 1,000 కోట్ల సమీకరణకు సెబీకి దరఖాస్తు

న్యూఢిల్లీ: స్పెషాలిటీ కెమికల్స్‌ తయారీ కంపెనీ సర్వైవల్‌ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 800 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, సంబంధిత వాటాదారులు ఆఫర్‌ చేయనున్నారు.

ప్రధానంగా విజయ్‌ కుమార్‌ రఘునందన్‌ ప్రసాద్‌ అగర్వాల్‌ రూ. 544 కోట్లకుపైగా విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 175 కోట్లను వర్కింగ్‌ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. కాంట్రాక్ట్‌ రీసెర్చ్, తయారీ సర్వీసుల(క్రామ్స్‌) ఈ కంపెనీ ప్రధానంగా స్పెషాలిటీ కెమికల్స్‌ రూపొందిస్తోంది. దేశీయంగా హెటెరోసైక్లిక్, ఫ్లోరో ఆర్గానిక్‌ ప్రొడక్ట్‌ గ్రూప్‌లకు చెందిన ప్రత్యేకతరహా ఉత్పత్తుల తయారీలోగల కొద్దిపాటి సంస్థలలో ఒకటిగా నిలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరం(2021–22) రూ. 312 కోట్ల ఆదాయం, రూ. 73 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది.

>
మరిన్ని వార్తలు