సింథటిక్‌ వజ్రాల ల్యాబ్‌.. ఎక్కడో తెలుసా?

24 Feb, 2023 07:40 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా సింథటిక్‌ వజ్రాల తయారీకి సంబంధించిన సెంటర్‌ను (ఇన్‌సెంట్‌–ఎల్‌జీడీ) ఐఐటీ–మద్రాస్‌లో ఏర్పాటు చేయనున్నట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది. దీనికి 5 ఏళ్లలో సుమారు రూ. 243 కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొంది. దేశీయంగా సింథటిక్‌ వజ్రాల తయారీ పరిశ్రమకు, వ్యాపారవేత్తలకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించేందుకు ఈ ప్రాజెక్టు తోడ్పడుతుందని వివరించింది.

స్టార్టప్‌లకు చౌకగా టెక్నాలజీని అందించేందుకు, ఉపాధి అవకాశాలను .. ఎల్‌జీడీ ఎగుమతులను పెంచేందుకు ఇన్‌సెంట్‌–ఎల్‌జీడీలో పరిశోధనలు ఉపయోగపడగలవని వాణిజ్య శాఖ తెలిపింది. ల్యాబ్స్‌లో తయారయ్యే వజ్రాలను ఆభరణాల పరిశ్రమలోనే కాకుండా కంప్యూటర్‌ చిప్‌లు, ఉపగ్రహాలు, 5జీ నెట్‌వర్క్‌లు మొదలైన వాటిల్లోనూ ఉపయోగిస్తారు. అంతర్జాతీయంగా ఈ మార్కెట్‌ 2020లో బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంది.

2025 నాటికి సింథటిక్‌ డైమండ్‌ ఆభరణాల మార్కెట్‌ 5 బిలియన్‌ డాలర్లకు, 2035 నాటికి 15 బిలియన్‌ డాలర్లకు వృద్ధి చెందుతుందన్న అంచనాలు ఉన్నాయి. 2021–22లో వీటికి సంబంధించి అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్‌కు 25.8% వాటా ఉంది. కెమికల్‌ వేపర్‌ డిపోజిషన్‌ (సీవీడీ) టెక్నాలజీతో వజ్రాలను తయారు చేసే టాప్‌ దేశాల జాబితాలో భారత్‌ కూడా ఉంది. అయితే, కీలకయంత్ర పరికరాలు, ముడి వనరు అయిన సీడ్స్‌ కోసం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది.

(ఇదీ చదవండి: కొత్త బడ్జెట్‌పై ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ విమర్శలు)

మరిన్ని వార్తలు