రూ. 5,000 కోట్లతో భారీ సోలార్‌ పీవీ ప్లాంట్‌ 

31 Jul, 2021 00:37 IST|Sakshi

ఫస్ట్‌ సోలార్‌ సంస్థ ప్రణాళిక 

తమిళనాడులో ఏర్పాటుకు అవకాశం 

న్యూఢిల్లీ: ఫస్ట్‌ సోలార్‌ ఐఎన్‌సీ 684 మిలియన్‌ డాలర్లతో (సుమారు రూ.5,000 కోట్లు) భారత్‌లో సమగ్ర ఫోటోవోల్టిక్‌ (పీవీ) థిన్‌ ఫిల్మ్‌ సోలార్‌ మాడ్యూళ్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రణాళికతో ఉన్నట్టు ప్రకటించింది. తమకు ప్రోత్సాహకరమైన రాయితీలతో కూడిన అనుమతి భారత ప్రభుత్వం నుంచి లభించినట్టయితే.. ఈ సమగ్ర పీవీ తయారీ కేంద్రం 2023 రెండో అర్థభాగంలో కార్యకలాపాలు ప్రారంభించే వీలుంటుందని తెలిపింది. తమిళనాడులో ఏర్పాటు కానున్న ఈ కేంద్రంతో 1,000 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని అంచనా.

ఆకర్షణీయమైన మార్కెట్‌ 
‘‘ఫస్ట్‌ సోలార్‌కు భారత్‌ ఆకర్షణీయమైన మార్కెట్‌. వేడి, తేమతో కూడిన వాతావరణం మా మాడ్యూల్‌ సాంకేతికతకు అనుకూలంగా ఉంటుంది. భారత్‌ సహజసిద్ధంగా సుస్థిరమైన మార్కెట్‌. అభివృద్ధి చెందుతున్న దేశం కావడంతో ఇంధనానికి డిమాండ్‌ ఉంది. ఏటా 25 గిగావాట్ల సోలార్‌ ఇంధనాన్ని వచ్చే తొమ్మిదేళ్లలో సాధించాలన్న స్పష్టమైన లక్ష్యంతో ఉంది. మా ప్రతిపాదిత తయారీ కేంద్రం 3.3 గిగావాట్ల సామర్థ్యంతో ఉంటుంది’’ అని ఫస్ట్‌ సోలార్‌ సీఈవో మార్క్‌విడ్‌మార్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పది అతిపెద్ద సోలార్‌ పీవీ తయారీ కంపెనీల్లో ఒకటైన ఫస్ట్‌ సోలార్‌ మిగిలిన వాటికి భిన్నమైన టెక్నాలజీని అమలు చేస్తుండడం గమన్హాం. 

మరిన్ని వార్తలు