Indian Army TATA Group ఆర్మీ విమానాల కాంట్రాక్టు దక్కించుకున్న టాటా గ్రూపు

24 Sep, 2021 12:37 IST|Sakshi

రక్షణ రంగంలో ప్రైవేటు పెట్టుబుడుల ప్రవాహం మొదలైంది. ఇండియన్‌ ఆర్మీకి అవసరమైన విమానాలు సరఫరా చేసే పనులను టాటా గ్రూపు దక్కించుకుంది. స్పెయిన్‌కి చెందిన ఎయిర్‌ బస్‌తో కలిసి టాటా సంస్థ  ఇండియన్‌ ఆర్మీకి విమానాలు తయారు చేసి ఇవ్వనుంది. 

రక్షణ రంగంలో త్రివిధ దళాలకు వివిధ ఎక్వీప్‌మెంట్స్‌, భారీ యంత్రాలను తయారు చేయడంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రమేయాన్ని తగ్గించి ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి తగ్గట్టుగా ప్రైవేటు సంస్థల నుంచి సీ- 295 కార్గో విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. 

ఆర్మీకి అవసరమైన సీ 295 విమానాలను తయారు చేసే పనిని టాటా గ్రూపు దక్కించుకుంది. స్పెయిన్‌కి చెందిన ఎయిర్‌బస్‌ సంస్థతో కలిసి టాటా గ్రూపు ఈ విమానాలు తయారు చేస్తుంది. ఇండియన్‌ ఆర్మీ, టాటా గ్రూపు మధ్య కుదిరిన ఈ ఒప్పందం విలువ రూ. 22,000 కోట్లుగా ఉంది. ఆర్మీకి సంబంధించి ప్రైవేటు ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు ఇదే అత్యంత ఖరీదైనదిగా నమోదైంది.

ఆర్మీ నుంచి కాంట్రాక్టు దక్కించుకున్న టాటా సంస్థ విమానాల తయారీ యూనిట్‌ని ఉత్తర్‌ ప్రదేశ్‌లో స్థాపించబోతున్నట్టు వార్తలు వస్తున్నా.. హైదరాబాద్‌, బెంగళూరులకు  అవకాశాలు ఉన్నాయని  ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

ఒప్పందం ప్రకారం అందించాల్సిన 56 విమానాల్లో 16 విమానాలను స్పెయిన్‌లో తయారు చేసి రెండేళ్ల వ్యవధిలో ఆర్మీకి అప్పగిస్తారు. మిగిలిన 40 విమానాలను దేశీయంగానే తయారు చేస్తారు. పదేళ్ల వ్యవధిలో టాటా గ్రూపు ఈ విమానాలను ఆర్మీకి అప్పగించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఆర్మీలో కార్గో సేవల్లో ఆర్వో విమానాలు సేవలు అందిస్తున్నాయి. త్వరలోనే వీటి కాలపరిమితి తీరిపోనుంది. దీంతో వాటి స్థానంలో సీ 295 విమానాలను ఆర్మీ ప్రవేశపెట్టనుంది.

చదవండి : ఎయిరిండియా రేసులో టాటా

మరిన్ని వార్తలు