ప్రపంచ చరిత్రలోనే.. ఎయిరిండియా బిగ్‌ డీల్‌, 500 విమానాల కొనుగోలుకు ఒప్పందం!

14 Feb, 2023 17:28 IST|Sakshi

ప్రపంచ చరిత్రలోనే తొలిసారి అరుదైన కొనుగోలు ఒప్పందం జరిగింది. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఎయిర్‌ షోలో టాటా గ్రూప్‌ తన విమానయాన సంస్థ ఎయిరిండియా కోసం ఫ్రాన్స్‌కు చెందిన విమానాల తయారీ సంస్థ ఎయిర్‌ బస్‌ నుంచి 250 విమానాల కొనుగోలుకు డీల్‌ కుదుర్చుకుంది. ఇదే విషయాన్ని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ అధికారికంగా ప్రకటించారు. 

విమానాల కొనుగోలు ఒప్పందం సందర్భంగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో భారత్‌ నుంచి ఎయిరిండియా చైర్మన్‌ రతన్‌ టాటా, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, ప్రధాని మోదీ.. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియాలు పాల్గొనగా.. ఫ్రాన్స్‌ నుంచి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ , ఎయిర్‌బస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గుయిలౌమ్ ఫౌరీలు పాల్గొన్నారు. 

ఈ డీల్‌లో 40  ఏ350 వైడ్‌ బాడీ లాంగ్‌ రేంజ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లు, 210 న్యారో బాడీ ఎయిర్‌ క్రాఫ్ట్‌ల కొనుగోలుకు రతన్‌ టాటా ఆర్డర్‌ ఇచ్చారు. అనంతరం మోదీ మాట్లాడుతూ..ఫ్రాన్స్‌తో ఒప్పందం చారిత్రాత్మకమని అన్నారు. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా విమానా కొనుగోళ్లు.. ఏవియేషన్‌ రంగంలో భారత్‌ మూడో అతిపెద్ద దేశంగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే 15 ఏళ్లలో భారత్‌కు 2,500 విమానాలు అవసరం అవుతాయని గుర్తు చేశారు. 

ఇక ఈ ఒప్పందం భారత్‌ - ఫ్రాన్స్ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలలో ఒక మైలురాయిగా నిలుస్తుందని మాక్రాన్ కొనియాడారు. ‘టాటా - ఎయిర్‌ బస్‌ సంస్థల ఒప్పందం హిస్టారిక్‌ మూమెంట్‌. ఈ కొనుగోలు ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు దోహహదపడుతుందని’ ఎయిర్‌బస్ సీఈవో గుయిలౌమ్ ఫౌరీ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, మరో ఏవియేషన్‌ సంస్థ బోయింగ్‌ నుంచి 250 విమానాల కొనుగోలుపై  టాటా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు