టాటా ఏస్‌ ఎలక్ట్రిక్‌ డెలివరీలు షురూ

14 Jan, 2023 05:42 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ ఏస్‌ ఎలక్ట్రిక్‌ మినీ ట్రక్‌ డెలివరీలు ప్రారంభించింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.9.99 లక్షల నుంచి మొదలు. ముందుగా 10 నగరాల్లో డెలివరీలను చేపట్టినట్టు కంపెనీ ప్రకటించింది. ఢిల్లీ, పుణే, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వీటిలో ఉన్నాయని వెల్లడించింది. ఈవీజెన్‌ పవర్‌ట్రైయిన్‌తో టాటా నుంచి తొలిసారిగా ఇది రూపుదిద్దుకుంది. 130 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌తో 27 కిలోవాట్‌ పవర్‌ మోటార్‌ ఏర్పాటు ఉంది.

ఒకసారి చార్జింగ్‌తో 154 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 2022 మే నెలలో ఏస్‌ ఎలక్ట్రిక్‌ను టాటా మోటార్స్‌ ఆవిష్కరించింది. ఆ సందర్భంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్, సిటీలింక్, డీవోటీ, లెట్స్‌ట్రాన్స్‌పోర్ట్, మూవింగ్, యేలో ఈవీ తదితర కంపెనీలతో మొత్తం 39,000 యూనిట్ల ఎలక్ట్రిక్‌ ఏస్‌ సరఫరాకు ఒప్పందం కుదిరింది. కాగా, పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ వేరియంట్లలోనూ ఇది లభిస్తుంది. ఇప్పటి వరకు భారత్‌లో 20 లక్షల పైచిలుకు ఏస్‌ వాహనాలు రోడ్డెక్కాయి.

మరిన్ని వార్తలు