భారీ డీల్‌: ఫోర్డ్‌ యూనిట్‌ను కొనేసిన టాటా! ఎన్ని వందల కోట్లంటే!

8 Aug, 2022 11:30 IST|Sakshi

దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌..ఫోర్డ్‌ మోటార్‌ మ్యాని ఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను కొనుగోలు చేసింది. ఈ  కొనుగోళ్లకు సంబంధించి అగ్రిమెంట్‌ నిన్ననే పూర్తయినట్లు తెలుస్తోంది.

కోవిడ్‌ కారణంగా తలెత్తిన ఆర్ధిక సమస్యలు, మార్కెట్‌లో దేశీయ ఆటోమొబైల్‌ కంపెనీల సత్తా చాటడంతో అమెరికన్‌ దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీ ఫోర్డ్‌ భారత్‌లో తన కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసింది. 2021 సెప్టెంబర్‌లో ఫోర్డ్‌ ఆ ప్రకటన చేసే సమాయానికి ఆ సంస్థకు గుజరాత్‌, తమిళనాడులో రెండు పెద్ద కార్ల తయారీ మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్లు ఉన్నాయి. ఆ యూనిట్లను ఫోర్డ్‌ అమ్మకానికి పెట్టగా..వాటిని కొనుగోలు చేసేందుకు టాటా కంపెనీ సిద్ధమైంది. 

ఈ తరుణంలో గుజరాత్‌లోని ఫోర్డ్‌కు చెందిన సనంద్ వెహికల్‌ ప్లాంట్‌ స్థలాలు,ఇతర ఆస్తులు,అలాగే అర్హులైన ఉద్యోగుల్ని కొనసాగించేలా ఒప్పందం జరిగింది. ఆ ఎంఓయూ ప్రకారం..గుజరాత్‌ ఫోర్డ్‌ కార్ల తయారీ ఫ్యాక్టరీని 91.5 మిలియన్‌ డాలర్లకు (రూ.726 కోట్లు) టాటా సంస్థ కొనుగోలు చేసింది. 

ఈ సందర్భంగా మా మ్యానిఫ్యాక్చరింగ్‌ సామర్థ్యం సంతృప్తి పరిచే స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఈ కొనుగోళ్లు సమయానుకూలమైనది. ఇది వాటాదారుల విజయం అంటూ' టాటా మోటార్స్‌ తెలిపింది. కాగా, సనంద్ ప్లాంట్‌ను కొనుగోలు చేయడం వల్ల టాటా మోటార్స్‌ ఏడాదికి 300,000 యూనిట్ల కార్ల తయారీ సామర్థ్యం 420,000కి పెరగవచ్చని భావిస్తుంది.  

గత ఏడాది ఫోర్డ్‌ భారత్‌లో తమ కార్ల తయారీ ఉత్పత్తిని నిలిపివేస్తున్నామని ప్రకటించింది. అప్పటి వరకు దేశీయ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో ఫోర్డ్‌ మార్కెట్‌ షేర్‌ 2శాతం మాత్రమే ఉంది. లాభాల్ని ఆర్జించడానికి రెండు దశాబ్దాలకు పైగా కష్టపడింది.

చదవండి👉: భారత్‌లో ఫోర్డ్‌, అమ్మో ఇన్ని వేల కోట్లు నష్టపోయిందా!

మరిన్ని వార్తలు