ఈవీ రంగంలో దూకుడు పెంచిన టాటా మోటార్స్.. ఇక వచ్చే ఐదు ఏళ్లలో!

15 Mar, 2022 18:22 IST|Sakshi

ప్రముఖ దేశీయ ఆటో మొబైల్ తయారీ దిగ్గజం టాటా మోటార్స్ రానున్న 5 ఏళ్లలో ఈవీ రంగంలో రూ.15,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నెక్సాన్ వంటి ఎలక్ట్రిక్ కార్లతో ఈవీ రంగంలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ మరో 10 కొత్త ఎలక్ట్రిక్ కార్లను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నట్లు టాటా మోటార్స్ బిజినెస్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర తెలిపారు.

"భవిష్యత్తు మార్కెట్ డిమాండ్'కు అనుగుణంగా రాబోయే ఐదు సంవత్సరాలలో మేము ఈవీ రంగంలో రూ.15,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాం. బాడీ స్టైల్స్, ధర, డ్రైవింగ్ రేంజ్ వంటి వివిధ రకాల 10 ఈవీలను అభివృద్ది చేస్తున్నాం" అని చంద్ర తెలిపారు. ప్రైవేట్ ఈక్విటీ మేజర్ టీపీజీ నుంచి టాటా మోటార్స్ 1 బిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. దీంతో, టాటా ఈవీ వ్యాపారం వీలువ 9.1 బిలియన్ డాలర్లుకు చేరుకుంది. ఔరంగాబాద్ మిషన్ ఫర్ గ్రీన్ మొబిలిటీ(ఏఎంజీఎమ్)లో భాగంగా నగర వాసులకు 101 ఎలక్ట్రిక్ కార్లను శైలేష్ చంద్ర అందించారు. ఇక మహారాష్ట్రలో టాటా మోటార్స్ దాదాపు 400 ఛార్జింగ్ స్టేషన్ల నెట్ వర్క్ కలిగి ఉంది. వీటిలో 15-20 ఔరంగాబాద్ నగరంలో ఉన్నాయి, వాటిని ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. టాటా మోటార్స్ ఇప్పటి వరకు 22,000 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించిందని అని అన్నారు. 

(చదవండి: బంగారం కొనేవారికి శుభవార్త.. భారీగా పడిపోతున్న ధరలు..!)

మరిన్ని వార్తలు