తగ్గేదేలే..! ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలో టాటా మోటార్స్‌ దూకుడు..!

12 Apr, 2022 07:16 IST|Sakshi

ఈవీ తయారీ సామర్థ్యం పెంపు: టాటా

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్‌ దూసుకెళ్తున్న నేపథ్యంలో తయారీ సామర్థ్యం పెంచుకోనున్నట్టు టాటా మోటార్స్‌ ప్రకటించింది. ప్రస్తుతం నెలకు 6,000 యూనిట్ల దాకా బుకింగ్స్‌ను కంపెనీ అందుకుంటోంది. టాటా మోటార్స్‌ దేశంలో నెక్సన్‌ ఈవీ, టిగోర్‌ ఈవీ, ఎక్స్‌ప్రెస్‌–టి మోడళ్లను విక్రయిస్తోంది.

కూపే తరహా ఎస్‌యూవీ రెండేళ్లలో రానుంది. సరఫరాను మించిన డిమాండ్‌ ఉందని టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికిల్, ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఎండీ శైలేశ్‌ చంద్ర తెలిపారు. గత నెలలో 3,400 యూనిట్లను మాత్రమే సరఫరా చేయగలిగామని వెల్లడించారు. డిజైన్‌ మార్పులతోపాటు సెమికండక్టర్ల కొరతను అధిగమించేందుకు విభిన్న సరఫరాదార్ల నుంచి కొనుగోలు చేస్తున్నట్టు వివరించారు.

ఈ చర్యలతో ఉత్పత్తి సామర్థ్యం పెరిగిందని చెప్పారు. ఏడు నెలల క్రితం నెలకు 600 యూనిట్లు మాత్రమే సరఫరా చేశామన్నారు. 2021–22లో దేశీయంగా టాటా మోటార్స్‌ 15,198 యూనిట్ల ఎలక్ట్రిక్‌ వాహనాలను విక్రయించింది. ఈవీ విభా గంలో సంస్థ వాటా 85.37 శాతంగా ఉంది.    

చదవండి: గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ అనూహ్య నిర్ణయం...ఇప్పుడు ఆ రంగంలోకి కూడా ఎంట్రీ..!

మరిన్ని వార్తలు