వాహన విక్రయాల్లో వృద్ధి

2 Apr, 2022 06:20 IST|Sakshi

వాణిజ్య వాహనాలకు పెరిగిన గిరాకీ

ముంబై: గత ఆర్థిక ఏడాది చివరి నెల మార్చి వాహన విక్రయాల్లో వృద్ధి నమోదైంది. టాటా మోటార్స్, ఎంఅండ్‌ఎం, టయోటా కిర్లోస్కర్‌ అమ్మకాలు పెరిగాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌ మోటార్స్, ఎంజీ మోటార్స్‌ విక్రయాలు క్షీణించాయి. వినియోగదారులు ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తుండటంతో ద్విచక్ర వాహనాలు అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. ‘‘2021–22లో వాహనాల ఉత్పత్తిపై ఎలక్ట్రానిక్‌ విడిభాగాల కొరత కొంత ప్రభావం చూపింది. ఆ ప్రభావాన్ని తగ్గించేందుకు కంపెనీ అన్ని చర్యలు తీసుకుంది. ఎలక్ట్రానిక్‌ విడిభాగాల సరఫరా పరిస్థితి అనూహ్యంగా కొనసాగుతున్నందున ప్రస్తుత సంవత్సరంలో ఇది కొంత ప్రభావం చూపవచ్చు’’ అని మారుతీ తెలిపింది.

► మారుతీ సుజుకీ మార్చి మొత్తం అమ్మకాలు 1,43,899 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే ఫిబ్రవరిలో విక్రయించిన మొత్తం 1,55,417 విక్రయాలతో పోలిస్తే స్వల్పంగా ఆరుశాతం(6.3)గా ఉంది.  2021–22లో ఎగుమతులు 2,38,376 యూనిట్లు నమో దయ్యాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయి ఎగుమతులు రికార్డు కావడం సంస్థ చరిత్రలో ఇదే తొలిసారి.  
► కియా మోటర్స్‌ మార్చి విక్రయాలు 18% పెరిగాయి. ఈ మార్చిలో మొత్తం 22,622 యూనిట్లకు అమ్మింది. ఒక నెలలో ఈ స్థాయిలో విక్రయించడం ఇదే తొలిసారి. సెమికండెక్టర్ల కొరత కారణంగా గడచిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,86,787 వాహనాలను విక్రయించింది. ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) విక్రయాల్లో టాటా మోటార్స్‌ 35 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ సంస్థ  మార్చిలో 86,718 కార్లను అమ్మగా.. గతేడాది ఇదేనెలలో 42,293 యూనిట్లను అమ్మింది. హీరో మోటో మార్చి అమ్మకాలు 14% క్షీణించాయి. గతే డాది మార్చిలో 5.24 లక్షల వాహనాలను విక్రయించగా.., ఈ మార్చిలో 4.50 లక్షల యూనిట్లు అమ్మింది.

మరిన్ని వార్తలు