హెచ్‌పీసీఎల్‌తో టాటా కీలక ఒప్పందం..!  

18 Jul, 2021 17:13 IST|Sakshi

న్యూ ఢిల్లీ: రోజురోజు పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంధన ధరలతో సతమతమవుతున్న ప్రజలు ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టిపెట్టారు. ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉత్పత్తి చేయడానికి ఇప్పటికే పలు కంపెనీలు రంగంలోకి దిగాయి. ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తితో పాటు ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి పలు కంపెనీలు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాయి. కాగా తాజాగా ప్రముఖ కార్ల తయారీదారు టాటా మోటార్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకోసం హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్‌)తో టాటా మోటర్స్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

హెచ్‌పీసీఎల్‌ పెట్రోల్‌ బంకుల్లో ఛార్జింగ్‌ స్టేషన్లను టాటా ఏర్పాటుచేయనుంది.   ఈ ఒప్పందం ప్రకారం..టాటా పవర్ దేశంలోని పలు నగరాలు,  ప్రధాన రహదారులలోని హెచ్‌పీసీఎల్ బంకుల వద్ద టాటా కంపెనీ ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనుంది. దీంతో ఎలక్ట్రిక్ వాహన యజమానులకు ఛార్జింగ్ మౌలిక సదుపాయాలకు కల్పించడంతో ఎటువంటి ఆందోళన లేకుండా ప్రయాణించటానికి వీలుంటుందని కంపెనీ తెలిపింది. టాటా పవర్ ఈ-జెడ్ ఛార్జ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వినియోగదారులు ఛార్జింగ్‌ను పెట్టుకోవచ్చును.

హెచ్‌పీసీఎల్‌ భాగస్వామ్యం ఎలక్ట్రిక్‌ వాహనాల వృద్ధి గణనీయంగా పెరుగుతుందని టాటా పవర్‌ ఆశాభావం వ్యక్తం చేసింది.  భారత ప్రభుత్వ జాతీయ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ (NEMMP) కు అనుగుణంగా చార్జింగ్‌ స్టేషన్లను టాటా ఏర్పాటుచేయనుంది. టాటా పవర్, ఈవి-ఛార్జింగ్ హెడ్ సందీప్ బాంగియా మాట్లాడుతూ.. హెచ్‌పీసీఎల్‌ భాగస్వామ్యంతో ఈవీ వాహనదారులకు మరింత ఛార్జింగ్‌ సులభతరం కానుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు