ఎయిర్ ఇండియా నూతన చైర్మ‌న్‌గా చంద్రశేఖరన్ నియామకం..!

14 Mar, 2022 19:39 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా నూతన చైర్మ‌న్‌గా నటరాజన్ చంద్రశేఖరన్'ను నియామిస్తున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది. ఆయన నియమకాన్ని దృవీకరిస్తూ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. టాటా గ్రూప్ గతంలో టర్కీకి చెందిన ఇల్కర్ ఐసీని ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ప్రకటించింది, కానీ ఈ నియామకం విషయంలో దేశంలో చాలా వ్యతిరేకత రావడంతో టర్కీకి చెందిన ఇల్కర్ ఐసీ టాటా ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉండటానికి నిరాకరించారు. అలా, నిరాకరించిన కొద్ది రోజులకే టాటా గ్రూప్ ఈ నిర్ణయం తీసుకుంది.

నటరాజ్ చంద్రశేఖరన్.. ప్రస్తుతం టాటా సన్స్ ఛైర్మన్‌గా పని చేస్తున్నారు. చంద్రశేఖరన్ అక్టోబర్ 2016లో టాటా సన్స్ బోర్డులో చేరిన ఒక ఏడాదిలోనే జనవరి 2017లో చైర్మ‌న్‌గా నియమించబడ్డారు. టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)తో సహా పలు గ్రూప్ ఆపరేటింగ్ కంపెనీల బోర్డులకు కూడా ఆయన అధ్యక్షత వహిస్తున్నారు. వీటిలో కొన్నింటికి 2009-17 వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు. టీసీఎస్'లో కెరీర్ ప్రారంభించిన చంద్రశేఖరన్ 30 ఏళ్లు సేవలందించి ఛైర్మన్ స్థాయికి ఎదిగారు. గతే ఏడాది అక్టోబర్‌ నెలలో స్పైస్‌జెట్‌ కన్సార్షియంతో పోటీపడి మరి ఎయిరిండియాను టాటా సన్స్‌ చేజిక్కించుకుంది. ఎయిరిండియా తిరిగి తమ నిర్వహణ కిందకు రావడం ఎంతో సంతోషంగా ఉందని టాటాసన్స్‌(టాటా కంపెనీల మాతృ సంస్థ) చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ ఇటీవల ప్రకటించారు.

(చదవండి: భారత్‌లో యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంఛ్ అప్పుడే.. రేంజ్ ఎంతో తెలుసా?)

మరిన్ని వార్తలు