కేంద్ర ప్రభుత్వాన్ని అధిగమించిన టాటా సన్స్‌

1 Jan, 2021 15:12 IST|Sakshi

లిస్టెడ్‌ కంపెనీలకు అతిపెద్ద ప్రమోటర్‌గా ఆవిర్భావం

ఏడాది కాలంలో మార్కెట్‌ విలువల గణాంకాల తారుమారు

2020 డిసెంబర్‌కల్లా పీఎస్‌యూలను మించిన టాటా సన్స్‌ విలువ

టాటా సన్స్‌ లిస్టెడ్‌ కంపెనీల విలువ ప్లస్‌- ఇదే కాలంలో పీఎస్‌యూల వెనకడుగు

న్యూఢిల్లీ, సాక్షి: గత కేలండర్‌ ఏడాది(2020)లో దేశీయంగా లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రీత్యా అతిపెద్ద ప్రమోటర్‌గా టాటా సన్స్‌ ఆవిర్భవించింది. తద్వారా పలు పీఎస్‌యూలలో మెజారిటీ వాటాలు కలిగిన కేంద్ర ప్రభుత్వాన్ని అధిగమించింది. 2020 డిసెంబర్‌ చివరికల్లా టాటా సన్స్‌ గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ 9.28 లక్షల కోట్లను తాకింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ అధీనంలోని పీఎస్‌యూల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ) రూ. 9.24 లక్షల కోట్లకు పరిమితమైంది. ఏడాది కాలంలో టాటా గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ 34 శాతానికిపైగా బలపడటం విశేషంకాగా. పీఎస్‌యూల విలువ దాదాపు 20 శాతం క్షీణించడం గమనార్హం! వెరసి రెండు దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం నిలుపుకుంటూ వస్తున్న టాప్‌ ర్యాంకును టాటా సన్స్‌ చేజిక్కించుకున్నట్లు ఆంగ్ల పత్రిక బిజినెస్‌ స్టాండర్ట్‌ నివేదిక పేర్కొంది.  (జేవీకి.. ఫోర్డ్‌, మహీంద్రాల ‘టాటా’)

ఏడాది కాలంలో..
నిజానికి 2019 డిసెంబర్‌కల్లా ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్‌ విలువ రూ. 18.6 లక్షల కోట్లుగా నమోదైంది. ఇదే సమయంలో టాటా సన్స్‌ గ్రూప్‌ లిస్టెండ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ. 11.6 లక్షల కోట్లుగా మాత్రమే నమోదైంది. ఈ సమయంలో టాటా సన్స్‌ గ్రూప్‌ కంపెనీల విలువతో పోలిస్తే ప్రమోటర్‌గా కేంద్ర ప్రభుత్వ కంపెనీల విలువ 67 శాతం అధికంకావడం గమనార్హం!  కాగా.. 2020 డిసెంబర్‌కల్లా మొత్తం టాటా సన్స్‌ గ్రూప్‌ కంపెనీల విలువ రూ. 15.6 లక్షల కోట్లకు చేరగా.. పీఎస్‌యూలలో కేంద్ర వాటాల విలువ రూ. 15.3 లక్షల కోట్లుగా నమోదైనట్లు నివేదిక పేర్కొంది.  

మరిన్ని వార్తలు