Tata Steel: కోవిడ్‌తో ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి జీతం

25 May, 2021 12:26 IST|Sakshi

ముంబై: పెద్ద మనసు చాటుకోవడంలో టాటా గ్రూపు ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. మొదటి దశలో భాగంగా కరోనా వైరస్‌ దేశాన్ని కుదిపేస్తున్న తరుణంలో 1500 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో... తాజాగా కోవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో తమ ఉద్యోగుల ప్రాణాలకు నష్టం వాటిల్లినట్లయితే, వారి కుటుంబాలకు తాము అండగా నిలబడతామని టాటా స్టీల్‌ ప్రకటించింది. సోషల్‌ సెక్యూరిటీ స్కీమ్‌ ద్వారా వారికి ఆర్థిక సహాయం చేస్తామని వెల్లడించింది. 

ఈ మేరకు... ‘‘టాటా స్టీల్‌... తమ ఉద్యోగుల కుటుంబాలకు, వారు మెరుగైన జీవనం సాగించేందుకు తన వంతు సహాయం చేస్తుంది. ఒకవేళ మా ఉద్యోగి కోవిడ్‌ కారణంగా మరణిస్తే, సదరు వ్యక్తి కుటుంబానికి జీతం అందజేస్తాం. ఉద్యోగి మరణించే నాటికి ఎంత మొత్తమైతే వేతనంగా పొందుతున్నారో, అంతే మొత్తాన్ని ఆ వ్యక్తికి 60 ఏళ్లు నిండేంత వరకు వారి ఫ్యామిలీకి పంపిస్తాం. వైద్య, గృహపరమైన లబ్ది పొందేలా చూసుకుంటాం. 

అంతేగాక, ఒకవేళ విధుల్లో భాగంగా కరోనా సోకి మృత్యువాత పడితే, పూర్తి స్థాయి జీతంతో పాటు సదరు ఉద్యోగి పిల్లలు గ్రాడ్యుయేషన్‌(ఇండియాలో) పూర్తి చేసేంత వరకు ఖర్చులన్నీ కూడా మేమే భరిస్తాం’’ అని సోషల్‌ మీడియా వేదికగా ఆదివారం వెల్లడించింది. తమ ఉద్యోగుల కుటుంబాలకు రక్షణ కవచంలా నిలుస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో టాటా స్టీలు కంపెనీ యాజమాన్యంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా... టాటా ట్రస్టు చైర్మన్‌ రతన్‌ టాటా దాతృత్వాన్ని గుర్తు చేస్తూ నెటిజన్లు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. 

చదవండి: స్టీల్ కంపెనీలకు సీఎం జగన్ కృతజ్ఞతలు
టాటా స్టీల్‌ టర్న్‌అరౌండ్‌

మరిన్ని వార్తలు