పెన్షన్‌పైనా పన్ను ఉంటుందా? పన్ను పడకపోవడానికి ఛాన్స్‌ ఎంతంటే..

6 Dec, 2021 11:16 IST|Sakshi

ప్రశ్న: నా పెన్షన్‌ రూ. 3,60,000. సేవింగ్స్‌ లేవు. ఇతర ఆదాయాలు లేవు. పెన్షన్‌ మీద పన్ను పడుతుందా? 
: యం. మంగతాయారు, రాజమండ్రి 
సమాధానం: ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. పెన్షన్‌ కూడా జీతంలాగే పన్నుకు గురయ్యే ఆదాయం. ఎటువంటి మినహాయింపు లేదు. పన్ను భారం లెక్కించేటప్పుడు ఆదాయంలాగే పరిగణనలోకి తీసుకోవాలి. రెండో విషయం .. మీకు సంబంధించిన ఇతర ఆదాయాలు ఏవీ లేవని అంటున్నారు కాబట్టి, మీ కేసులో మీరు 60 సం.లు. దాటినట్లయితే బేసిక్‌ లిమిట్‌ రూ. 3,00,000 అవుతుంది. బేసిక్‌ లిమిట్‌ దాటినా నికర ఆదాయం రూ. 5,00,000 లోపల ఉంటే పన్ను భారం లెక్కించిన తర్వాత రిబేటు ఉండటం వల్ల ఎటువంటి పన్ను భారం ఉండదు. సెక్షన్‌ 87 అ ద్వారా రిబేటు లభిస్తుంది. పెన్షన్‌లో నుంచి రూ. 50,000 తగ్గిస్తారు. ఈ తగ్గింపును స్టాండర్డ్‌ డిడక్షన్‌ అంటారు. కానీ ఫ్యామిలీ పెన్షన్‌ని జీతంగానూ, పెన్షన్‌గానూ భావించరు. ఆ మొత్తాన్ని ‘ఇతర ఆదాయం’గా పరిగణించి, అందులో నుంచి 1/3వ భాగం లేదా రూ. 15,000 ..ఈ రెండింటిలో ఏది తక్కువైతే .. ఆ మొత్తాన్ని మినహాయింపుగా ఇస్తారు. ఏ పెన్షన్‌ అయినా పన్నుభారానికి గురి అవుతుంది. బేసిక్‌ లిమిట్‌ లోపల ఉన్నా .. రూ. 5,00,000 లోపల ఉన్నా రిబేటు పొందడం ద్వారా పన్ను పడకపోవచ్చు. 

-----------

ప్రశ్న: నేను గత వారం ఆదాయపు పన్ను రిటర్న్‌ వేసి రిఫండ్‌ క్లెయిమ్‌ చేశాను. ఈ రోజు రిఫండ్‌ .. నా బ్యాంకు అకౌంట్లో జమ అయింది. ఎటువంటి సమాచారం /ఆర్డర్లు / ఉత్తరాలు రాలేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?  
:  యం. శంకరరావు, సికింద్రాబాద్‌ 

సమాధానం: అవును. ఇప్పుడు చాలా త్వరగా అసెస్‌మెంట్‌ చేస్తున్నారు. సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ సెల్‌ ద్వారా జరుగుతోంది. అన్ని అంశాలు .. అంటే ఆదాయం, తగ్గింపులు, మినహాయింపులు, పన్ను చెల్లింపులు, బ్యాంకు అకౌంట్‌ వివరాలు మొదలైనవి సరిగ్గా ఉంటే సత్వరం రిఫండ్‌ ఇస్తున్నారు. ముందుగా 143 (1) ప్రకారం ఆర్డరు మీకు ఈమెయిల్‌ ద్వారా వస్తుంది. చెక్‌ చేసుకోండి. 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను మీ అసెస్‌మెంట్‌ అయినట్లు. ఏమీ గాభరా పడక్కర్లేదు. అయితే, కొన్ని మార్గదర్శకాలను అనుసరించి ‘‘స్క్రూటినీ’’ ఎంపిక చేస్తే మాత్రం మళ్లీ అసెస్‌మెంట్‌ చేస్తారు. 

----------------

ప్రశ్న:2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను కాస్ట్‌ అప్‌ ఇన్‌ఫ్లేషన్‌ ఇండెక్స్‌ ఎంత ఉంది. దీన్ని ఎలా నిర్ణయిస్తారు?
: జె.వి.యస్‌. యన్‌. మూర్తి, హైదరాబాద్‌ 

సమాధానం: 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ ఇండెక్స్‌ను 317గా నిర్ణయించి, ఆ మేరకు నోటిఫికేషన్‌ ఎప్పుడో జారీ చేశారు. ప్రతి సంవత్సరం ఇది మారుతుంటుంది. దేశంలో ఉన్న ద్రవ్యోల్బణం .. అంటే ధరల పెరుగుదల సూచికను బట్టి కేంద్ర ప్రభుత్వంలోని నిపుణులు ఈ ఇండెక్స్‌ లెక్కిస్తారు. ఆదాయపు పన్ను విభాగం ఒక నోటిఫికేషన్‌ ద్వారా తెలియజేస్తుంది. ఈ సంవత్సరంలో జరిగే స్థిరాస్తి క్రయ విక్రయాలు, ఇతర క్యాపిటల్‌ ఆస్తులు, షేర్లు మొదలైన వాటికి దీన్ని వర్తింపచేస్తారు. 

పన్నుకు సంబంధించిన సందేహాలు business@sakshi.com ఈ–మెయిల్‌ పంపించగలరు. 


 - కేసీహెచ్‌ ఏవీఎస్‌ఎన్‌ మూర్తి, కేవీఎన్‌ లావణ్య.. ట్యాక్సేషన్‌ నిఫుణులు                                                                                                                                   

మరిన్ని వార్తలు