TCS: ప్రపంచ దిగ్గజంగా టీసీఎస్‌ !

23 Apr, 2022 08:56 IST|Sakshi

అతిపెద్ద ఐటీ కంపెనీగా ఆవిర్భవించడంపై దృష్టి 

కంపెనీ సీఈవో, ఎండీ, రాజేష్‌ గోపీనాథన్‌ వెల్లడి  

ముంబై: సాఫ్ట్‌వేర్‌ సేవలకు దేశీయంగా నంబర్‌ వన్‌ ర్యాంకులో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీగా ఎదిగే లక్ష్యాన్ని ప్రకటించింది. ఇప్పటికే భారీగా కార్యకలాపాలు విస్తరించిన కంపెనీ ఇందుకు భయపడటంలేదని టీసీఎస్‌ సీఈవో, ఎండీ, రాజేష్‌ గోపీనాథన్‌ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. లక్ష్యాలను చేరుకునేందుకు కంపెనీకున్న భారీస్థాయి అడ్డుకాదని స్పష్టం చేశారు. 25 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 1,90,000 కోట్లు) ఆదాయం, 6 లక్షలమంది ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థ భవిష్యత్‌లో రెట్టింపు, మూడు రెట్లు, లేదా నాలుగు రెట్లు వృద్ధిని ఆశించడం తప్పేమీకాదని తెలియజేశారు. ప్రస్తుత స్థాయి నుంచి మరింత భారీ కంపెనీగా ఆవిర్భవించే లక్ష్యాలను పెట్టుకోకపోవడానికి తగిన కారణమేదీ కనిపించడంలేదని వివరించారు. ఇప్పటికే తాము పలు విధాల వృద్ధి బాటలో సాగుతున్నట్లు తెలియజేశారు. 

బీఎఫ్‌ఎస్‌ఐలో టాప్‌ 
బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసులు, బీమా విభాగం(బీఎఫ్‌ఎస్‌ఐ)లో ఐటీ సర్వీసులు అందిస్తున్న అతిపెద్ద కంపెనీగా టీసీఎస్‌ నిలుస్తున్నట్లు గోపీనాథన్‌ తెలియజేశారు. ఉద్యోగుల సంఖ్యలోనూ రెండో ర్యాంకులో ఉన్నట్లు వెల్లడించారు. ఈ బాటలో గ్లోబల్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లోనూ అగ్రపథానికి చేరుకునే దృష్టాంతాలున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచస్థాయిలో 50, 100 బిలియన్‌ డాలర్ల పరిమాణంగల పలు కంపెనీలున్నట్లు ఈ సందర్భంగా ప్రస్తావించారు.


చదవండి👉🏼గుడ్‌ న్యూస్‌: భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు..ఎప్పటి నుంచంటే!

మరిన్ని వార్తలు