హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నది ఈ సం‍స్థలోనే

17 Sep, 2021 20:34 IST|Sakshi

TCS largest IT Sector employer in Hyderabad: గడిచిన రెండు దశాబ్ధాలుగా హైదరాబాద్‌ నగరం ఐటీకి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. స్టార్టప్‌లు మొదలు పెడితే అంతర్జాతీయ సంస్థల వరకు ఇక్కడ తమ సంస్థలను నెలకొల్పాయి. అయితే ఇందులో అత్యధిక మంది ఐటీ ఉద్యోగులు ఉన్న సం‍స్థగా టీసీఎస్‌ నిలిచింది.

టీసీఎస్‌
దేశంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీగా పేరొందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సంస్థ హైదరాబాద్‌లో మరో మైలురాయిని దాటింది. భాగ్యనగరం కేంద్రంగా ఐటీ సేవలు అందిస్తున్న సంస్థలను వెనక్కి నెట్టింది. ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు ఉన్న సంస్థగా మొదటి స్థానంలో నిలిచింది.

62,000 మంది 
టీసీఎస్‌ సంస్థకు హైదరాబాద్‌లో ఉన్న కార్యాలయాల్లో పని చేస్తున్న మొత్తం ఉద్యోగుల సంస్థ 62,000 దాటింది. దీంతో అత్యధికమంది ఐటీ ఉద్యోగులు ఉన్న సంస్థగా టీసీఎస్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని టీసీఎస్‌ రీజనల్‌ హెడ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ రాజన్న వెల్లడించారు. ఇటీవల ప్రభుత్వ ఆస్పత్రుల్లో వెంటిలేటర్ల కొనుగోలుకు సంబంధించి రూ. 2.2 కోట్ల చెక్కును ప్రభుత్వానికి ఆయన అందచేశారు.

బెంగళూరుకి ధీటుగా
బెంగళూరు తర్వాత ఐటీ రంగంలో హైదరాబాద్‌ ద్వితీయ స్థానంలో ఉంది. బడా ఐటీ కంపెనీలు, స్టార్టప్‌లు అన్నీ బెంగళూరు ప్రథాన స్థానంగా చేసుకుని కార్యకలపాలు సాగిస్తున్నాయి. అయితే బెంగళూరు తర్వాత స్థానం కోసం ఇటు పూనే, అటు నోయిడా నుంచి గట్టి పోటీ ఉన్నా హైదరాబాద్‌ ఐటీలో వాటికి అందకుండా దూసుకుపోతుంది. తాజాగా టీసీఎస్‌ ప్రకటించిన వివరాలతో ఈ విషయం మరోసారి రూఢీ అయ్యింది. 

చదవండి : టీసీఎస్‌లో భారీగా ఫ్రెషర్ల నియామకాలు

మరిన్ని వార్తలు