Moonlighting : మూన్‌లైటింగ్‌కు కేంద్రం సపోర్ట్‌, రూటు మార్చిన టెక్‌ కంపెనీలు

11 Oct, 2022 08:20 IST|Sakshi

మూన్‌ లైటింగ్‌ (రెండు చోట్ల ఉద్యోగాలు చేయడం) విధానాన్ని కేంద్రం సమర్ధించడంతో దేశీయ టెక్‌ కంపెనీలు రూటు మార్చాయి. ఇప్పటి వరకు తమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఉద్యోగుల్నిటెక్‌ కంపెనీలు విధుల నుంచి తొలగించాయి. తాజాగా మూన్‌లైటింగ్‌ అంశంలో ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రముఖ టెక్‌ సంస్థ టీసీఎస్‌ వెల్లడించింది. ఇప్పుడు టీసీఎస్‌ దారిలో మరికొన్ని కంపెనీలు ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం ఉందని హెచ్‌ఆర్‌ కన్సల్టెన్సీ సర్వీస్‌ నిపుణులు భావిస్తున్నారు.   

దేశీ ఐటీ సేవల కంపెనీలు అక్టోబర్‌ 10 (సోమవారం) నుంచి ఈ ఏడాది 2022 -23  క్యూ2 (రెండో త్రైమాసిక) ఫలితాల్ని విడుదల చేస్తున్నాయి. తొలుత టీసీఎస్‌ క్యూ2 ఫలితాల చేయగా.. తర్వాత  విప్రో,హెచ్‌సీఎల్‌, ఇన్ఫోసిస్‌ సైతం క్యూ2 పనితీరు  వెల్లడించనున్నాయి.  

ఈ నేపథ్యంలో క్యూ2 ఫలితాల అనంతరం టీసీఎస్‌ చీఫ్‌ హెచ్‌ఆర్‌వో మిలింద్‌ లక్కడ్‌ మూన్‌లైటింగ్‌ అంశంపై స్పందించారు. 6.16 లక్షల మందికి పైగా ఉద్యోగులున్న తమ సంస్థ (టీసీఎస్‌) ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై తుది అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు అన్నీ కోణాల్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

 

మూన్‌లైటింగ్‌ అనేది నైతికతకు సంబంధించిన అంశం. ఇది తమ సంస్థ విలువలు, సంస్కృతికి విరుద్ధమే. అయినప్పటికీ మరో టెక్‌ సంస్థ విప్రో మూన్‌ లైటింగ్‌ పాల్పడుతున్న 300 మంది ఉద్యోగుల్ని ఫైర్‌ చేసిందని, కానీ మేం మాత్రం ఇప్పటి వరకూ ఉద్యోగులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని పేర్కొన్నారు.

అంతేకాదు టీసీఎస్‌ తన ఉద్యోగుల పట్ల దీర్ఘకాలిక నిబద్ధతను కలిగి ఉందని, ఉద్యోగులకు కంపెనీ పట్ల  పరస్పర నిబద్ధత ఉందని, ప్రస్తుతం ఐటీ పరిశ్రమలో ఇతర సంస్థలు వారి ఉద్యోగుల విషయంలో భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉండవచ్చని ఆయన అంగీకరించారు. మూన్‌లైటింగ్‌పై కంపెనీ తన వైఖరిని వెల్లడిస్తుందని టీసీఎస్‌ చీఫ్‌ హెచ్‌ఆర్‌వో మిలింద్‌ లక్కడ్‌ తెలిపారు. 

మరోవైపు, జాబ్‌ ఆఫర్లు అన్నింటినీ గౌరవిస్తున్నామని, ప్రథమార్ధంలో ఇప్పటికే 35,000 మంది ఫ్రెషర్స్‌ను తీసుకున్నామని చెప్పారు. మరో 12,000 మందిని తీసుకోబోతున్నామని.. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 40,000 పైచిలుకు ఫ్రెషర్స్‌ నియామక లక్ష్యాన్ని అధిగమించబోతున్నామని లక్కడ్‌ తెలిపారు.

కేంద్రం సపోర్టు
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్‌ 21న వర్క్ ఫ్రం హోం పేరిట ఒకేసారి  రెండు ఉద్యోగాలు చేస్తున్న 300 మంది ఉద్యోగుల్ని విప్రో ఫైర్‌ చేసింది. మూన్ లైటింగ్ విధానం అనైతికమని..నిబంధనలు అతిక్రమిస్తే వేటు తప్పదని ఇన్ఫోసిస్ విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్ జీ హెచ్చరించారు. 

విప్రో నిర్ణయం తర్వాత సెప్టెంబర్‌ 24న పబ్లిక్‌ అఫైర్స్‌ ఫోరమ్‌ ఆఫ్‌ ఇండియా (పీఏఎఫ్‌ఐ) సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌.. ఉద్యోగుల మూన్‌లైటింగ్‌ను సమర్ధించారు. 

టెక్‌ దిగ్గజ కంపెనీలతో  ఒప్పందం కుదుర్చుకున్న ఉద్యోగులు.. అదే ఉద్యోగం కోసం తమ జీవితాల్ని త్యాగం చేసే రోజులు గడిచిపోయాయని అన్నారు. అంతేకాదు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించి ఇతర స్టార‍్టప్‌లలో పని చేయకూడదని చెబుతున్న ఐటీ కంపెనీల ప్రయత్నాలు విఫలమవుతున్నాయని రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు.

చదవండి👉 విప్రో మరో కీలక నిర్ణయం, ఉద్యోగుల్లో ఆందోళన!

మరిన్ని వార్తలు