స్పెక్ట్రం బిడ్డింగ్‌కు రూ. 13,475 కోట్ల డిపాజిట్‌

19 Feb, 2021 05:46 IST|Sakshi

న్యూఢిల్లీ: రాబోయే విడత స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు టెలికం సంస్థలు మొత్తం రూ. 13,475 కోట్ల డిపాజిట్‌ (ఈఎండీ) సమర్పించాయి. రిలయన్స్‌ జియో అత్యధికంగా రూ. 10,000 కోట్లు, భారతి ఎయిర్‌టెల్‌ రూ. 3,000 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ. 475 కోట్ల ఈఎండీ ఇచ్చాయి. టెలికం శాఖ (డాట్‌) గురువారం ఈ వివరాలు వెల్లడించింది. మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే స్పెక్ట్రం వేలం నిబంధనల ప్రకారం దీని ఆధారంగానే నిర్దిష్ట పరిమాణం స్పెక్ట్రం కోసం పోటీపడేందుకు అనుమతిస్తారు. మొత్తం అన్ని స్పెక్ట్రం బ్లాకుల కోసం బిడ్‌ చేయాలంటే  రూ. 48,141 కోట్ల ఈఎండీ చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే వేలంలో పెద్దయెత్తున స్పెక్ట్రం అమ్ముడు కాకపోవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు