PAN India 5G: కీలక విషయాలు వెల్లడించిన టెలికాం మంత్రి

27 Aug, 2022 12:56 IST|Sakshi

మూడేళ్లలో దేశవ్యాప్తంగా 5జీ సేవలు

టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడి  

న్యూఢిల్లీ: అత్యంత వేగవంతమైన 5జీ టెలికం సర్వీసులు వచ్చే రెండు, మూడేళ్లలో దాదాపు దేశమంతటా అందు బాటులోకి రాగలవని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో మొబైల్‌ సేవలు అత్యంత చౌకగా లభిస్తున్నాయని, 5జీ వచ్చాక కూడా అదే ధోరణి కొనసాగగలదని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

‘పరిశ్రమలోకి రూ. 2.5-3 లక్షల కోట్ల పెట్టుబడులు రాగలవని అంచనా వేస్తున్నాం. ఉద్యోగాల కల్పనకు కూడా ఇది తోడ్పడుతుంది. వచ్చే 2-3 ఏళ్లలో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నాం‘ అని వైష్ణవ్‌ వివరించారు. టెలికం కంపెనీలు 5జీకి అవసరమైన మౌలిక సదుపాయలను ఏర్పాటు చేసుకోవడంలో నిమగ్నమయ్యాయని చెప్పారు. అక్టోబర్‌ కల్లా వీటిని ప్రవేశపెట్టొచ్చని, ఆ తర్వాత అత్యంత వేగంగా విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేబుళ్లు, మొబైల్‌ టవర్ల ఏర్పాటుకు (ఆర్‌వోడబ్ల్యూ) అనుమతుల ప్రక్రియకు గతంలో 343 రోజులు పట్టేసేదని, సంస్కరమల ఊతంతో గతేడాది జూలై నాటికి ఇది సగటున 16 రోజులకు తగ్గిందని ఆయన చెప్పారు.  

>
మరిన్ని వార్తలు