Tencent: పదేళ్లలో ఇదే తొలిసారి.. 5వేలకు పైగా ఉద్యోగులను తొలగించిన ప్రముఖ కంపెనీ

18 Aug, 2022 19:21 IST|Sakshi

టెక్నాల‌జీ, ఎంట‌ర్‌టైన్‌మెంట్ దిగ్గజం టెన్సెంట్ గత పదేళ్లలో తొలిసారిగా లేఆఫ్‌ల‌ను ప్ర‌క‌టించింది. త్రైమాసిక రాబ‌డి అంచ‌నాలు అందుకోలేక‌పోయిన త‌ర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. గ‌త క్వార్ట‌ర్‌లో ఆశించిన ఫలితాలు అందుకోవడంలో విఫలమైనందుకు టెన్సెంట్ దాదాపు 5,500 మంది ఉద్యోగుల‌ను సాగ‌నంపింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. జూన్ చివరి నాటికి కంపెనీలో 1,10,715 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇది మార్చి నెలలో నమోదైన దానితో పోలిస్తే దాదాపు 4.7 శాతం తక్కువ.

ఫలితాలు మెరుగుకాకపోతే.. ఇంటికే
కేవలం టెన్సెంట్‌ మాత్రమే కాదు ఇలా చెప్పుకుంటూ పోతే, చైనా అతిపెద్ద టెక్నాలజీ కార్పొరేషన్ కూడా ఖర్చు తగ్గింపు చర్యగా ఒక దశాబ్దంలో మొదటిసారిగా నియామకాలను నిలిపివేసింది. ప్రస్తుతం గూగుల్‌తో సహా కొన్ని ఇతర టాప్ టెక్ కంపెనీలు ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా అనేక మంది ఉద్యోగులను తొలగించాయి. మరో చైనీస్ టెక్ కంపెనీ అలీబాబా ఇటీవల ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఖర్చు తగ్గించే చర్యల్లో భాగంగా దాదాపు 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. 

గూగుల్‌ సీఈఓ సుందర్ పిచాయ్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కంపెనీలో చాలా మంది ఉద్యోగులు ఉన్నారని, అయితే చాలా తక్కువ మంది మాత్రమే పనిచేస్తున్నారని, ప్రతి ఒక్కరూ గతంలో కంటే కష్టపడి పనిచేయాలని కోరారు. దీంతో పాటు కొంతమంది టాప్ గూగుల్ ఎగ్జిక్యూటివ్‌లు సంస్థలో తొలగింపుల గురించి మాట్లాడుతూ.. ఉద్యోగులు తమ పనితీరును పెంచుకోకపోతే, తొలగింపులకు సిద్ధం కావాలని హెచ్చరించారు. తొలగింపులు జరుగుతాయా లేదా అనేది తదుపరి త్రైమాసిక ఆదాయాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.

చదవండి: గుడ్‌ న్యూస్‌: ఐఫోన్‌ 14 వచ్చేస్తోంది, అదికూడా ఊహించని ధరలో

                                                                                                                                                                                                     

మరిన్ని వార్తలు