డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే!

29 Nov, 2021 20:02 IST|Sakshi

New Rules From 1st December 2021: అమ్మో ఒకటో తారీఖు..! ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంటి అద్దె బిల్లులు, చిన్న చితకా బిల్లులను ఇతర లావాదేవీలను ఒకటో తారీఖున చెల్లిస్తారు. ప్రతి నెల ఒకటవ తేదీన దేశంలో కూడా అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఈ నిబంధనలు వల్ల సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది.

దేశవ్యాప్తంగా వచ్చే నెల డిసెంబర్ 1 నుంచి పలు కీలక నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర, ఈపీఎఫ్ అకౌంట్ ఆధార్ నెంబర్ లింకింగ్, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వంటి అనేక అంశాలకు సంబంధించి డిసెంబర్‌లో మార్పులు చోటు చేసుకొనున్నాయి. అలాంటి కొత్త రూల్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం..

డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త రూల్స్:

  • ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు డిసెంబర్ 1 నుంచి ఈఎంఐ ద్వారా జరిపే కొనుగోళ్లకు అదనపు ఛార్జీ చెల్లించాలి. ఈఎంఐ కొనుగోళ్లపై రూ.99 + ట్యాక్సులు చెల్లించాలని ఎస్‌బీఐ ప్రకటించింది. అంటే ఆన్‌లైన్ షాపింగ్‌తో పాటు మర్చంట్స్ దగ్గర ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ఈ ఛార్జీలు 2021 డిసెంబర్ 1 నుంచే అమలులోకి రానున్నాయి. 
  • 14 ఏళ్ల తర్వాత అగ్గిపెట్ట రేటు పెరగడం ఇదే మొదటిసారి. ముడిపదార్థాల ధరలు పెరగడంతో అగ్గిపెట్ట ధరలను పెంచనున్నట్లు ఉత్పత్తిదారులు పేర్కొన్నారు. డిసెంబర్‌ 1వ తేదీ నుంచి అగ్గిపెట్టె రూ.2కు విక్రయించనున్నట్లు ఉత్పత్తిదారుల సంఘం ప్రకటించింది. అయితే ఒక్క రూపాయి అగ్గిపెట్టెలో 36 స్టిక్స్ ఉంటే, రెండు రూపాయల అగ్గిపెట్టెలో 50 స్టిక్స్ ఉండనున్నాయి. డిసెంబర్ 1 నుంచే కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. 
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లను తగ్గించింది. ప్రస్తుతం ఇస్తున్న 2.90 వార్షిక వడ్డీని 2021 డిసెంబర్ 1 నుంచి 2.80 శాతానికి తగ్గిస్తూన్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. సేవింగ్స్ అకౌంట్‌లో రూ.10,00,000 లోపు ఉన్నవారికి 2.80 శాతం వడ్డీ, రూ.10,00,000 కన్నా ఎక్కువ ఉంటే 2.85 శాతం వడ్డీ లభించనుంది.
  • 2021-22 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్స్ ఫైల్ చేయాల్సిన వారికి 2021 డిసెంబర్ 31 వరకే గడువు ఉంది. ఒకవేళ అప్పట్లోగా రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఆ తర్వాత జరిమానా ఫీజు చెల్లించి బిలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయల్సి ఉంటుంది. 
  • నవంబర్ 30లోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించని పెన్షనర్లకు డిసెంబర్ నుంచి పెన్షన్ రాదు. రిటైర్ అయిన ఉద్యోగులు అంతరాయం లేకుండా పెన్షన్​ పొందాలంటే ఏటా నవంబర్​ 1 నుంచి నవంబర్​ 30 మధ్య బ్యాంకులకు లైఫ్​ సర్టిఫికెట్​ సబ్​మిట్ చేసుకోవచ్చు. పెన్షనర్ ఇంకా బతికే ఉన్నాడని సర్టిఫికేట్ రుజువుగా పనిచేస్తుంది.
  • రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు పెరిగాయి. అన్ని ప్లాన్స్‌పై 20 శాతం వరకు ధరలు పెరిగినట్టు జియో ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్స్ 2021 డిసెంబర్ 1న అమలులోకి రానున్నాయి. 
  • ఈపీఎఫ్ ఖాతాదారులు నవంబర్ 30లోపు తప్పనిసరిగా యూనివర్సల్ అకౌంట్ నెంబర్‌ను ఆధార్ నెంబర్‌తో లింక్ చేయాలి. గతంలో 2021 సెప్టెంబర్ 1లోగా ఉన్న గడువును 2021 నవంబర్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అప్పట్లోగా యూఏఎన్‌ను ఆధార్ నెంబర్‌తో లింక్ చేయాల్సిందే. లేకపోతే డిసెంబర్ నెలకు సంబంధించిన యజమాని వాటా ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ కాదు. 
  • ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల 1, 15వ తేదీ నాడు గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తాయి. అలాగే, డిసెంబర్ 1న కూడా గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించనున్నాయి. నవంబర్‌లో కమర్షియల్ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు రూ.266 పెంచాయి. డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. మరి డిసెంబర్ 1న డొమెస్టిక్ సిలిండర్ ధరలు పెరుగుతాయో, తగ్గుతాయో చూడాలి.

(చదవండి: మైక్రోసాఫ్ట్‌ సరికొత్త వ్యూహం.. ఇక ఖాతాలకు పాస్‌వర్డ్ అవసరం లేదు!)

మరిన్ని వార్తలు