బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్

28 Sep, 2021 18:11 IST|Sakshi

ప్రతి నెల ఒకటవ తేదీన దేశంలో అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. అయితే, అక్టోబర్ 1 నుంచి కూడా కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి రాబోతున్నాయి. ఇందులో బ్యాంకుకు చెందిన అంశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల మీపై నేరుగానే ప్రభావం పడే అవకాశముంది. అందుకే, అక్టోబర్ 1 నుంచి ఏ ఏ రూల్స్ మారబోతున్నాయో తెలుసుకోండి.(చదవండి: వారానికి నాలుగు రోజులే ఆఫీస్‌.. తెరపైకి కొత్త పాలసీ!)

  • ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) ఖాతాదారుల చెక్‌బుక్‌లు అక్టోబర్ 1 నుంచి చెల్లవు అని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) అప్రమత్తం చేసింది. ఈ రెండు బ్యాంకు ఖాతాదారులు పీఎన్‌బీ బ్రాంచీ నుంచి కొత్త చెక్‌బుక్స్ పొందాల్సి ఉంటుంది అని తెలిపింది. అప్ డేట్ చేసిన ఐఎఫ్‌ఎస్‌సీ, ఎంఐసీఆర్‌తో కూడిన పీఎన్‌బీ చెక్‌బుక్స్ అక్టోబర్ 1, 2021 నుంచి చెల్లుబాటు అవుతాయి.
  • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్​బీఐ) తప్పనిసరి చేసిన కొత్త నిబందనల ప్రకారం.. అక్టోబర్ 1 నుంచి క్రెడిట్​, డెబిట్​ కార్డుల ద్వారా ఆటో డెబిట్​ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే.. ఆ పేమెంట్​కు ఓటీపీ అదనపు ధ్రువీకరణ(ఏఎఫ్‌ఏ) అవసరం. రూ.5000 కంటే ఎక్కువ మొత్తానికి ఆటో డెబిట్​ సదుపాయాన్ని వాడుకోవాలంటే ఓటీపీ అదనపు ధ్రువీకరణ(ఏఎఫ్‌ఏ) అవసరమవుతుంది. ఆటో డెబిట్​ తేదీకి కొన్ని రోజుల ముందే లావాదేవికి సంబంధించిన సమాచారాన్ని వినియోగదారుడికి బ్యాంకులు పంపిస్తాయి.
  • అక్టోబర్ 1 నుంచి 80 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెన్షనర్లు దేశంలోని సంబంధిత హెడ్ పోస్ట్ ఆఫీసు "జీవన్ ప్రమాణ్ సెంటర్స్"లో తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను సబ్మిట్ చేసే అవకాశాన్ని కల్పించింది. 80 ఏళ్లు పైబడిన వారు ఇకపై పెన్షన్‌ను సక్రమంగా అందుకోవాలంటే డిజిటల్‌ ఫార్మాట్‌లో జీవన ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
  • సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ప్రకటించినట్లుగా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ)ల్లో పనిచేసే జూనియర్‌ స్థాయి ఉద్యోగులు తమ స్థూల వేతనంలో 10 శాతం ఆ మ్యూచువల్ ఫండ్ యూనిట్లలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
మరిన్ని వార్తలు