ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే..!

30 Jan, 2022 15:03 IST|Sakshi

అమ్మో ఒకటో తారీఖు..! ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంతో పాటు దేశంలో కూడా అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. దేశంలో కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఈ నిబంధనలు వల్ల కొన్ని సార్లు సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. వచ్చేనెల ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనుండగా పలు రంగాల్లో రానున్న మార్పులను మనం స్వాగతించాల్సి ఉంటుంది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానున్న బ్యాంకులకు సంబంధించిన కొత్త రూల్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం..

► దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 1 నుంచి తక్షణ చెల్లింపు సేవ(ఐఎంపీఎస్‌) ఛార్జీలను పెంచనుంది. ఎస్‌బీఐ బ్యాంక్ బ్రాంచ్‌లో ఐఎంపీఎస్‌ ద్వారా చేసే నగదు బదిలీకి ఛార్జీ విధించనుంది. ఐఎమ్‌పిఎస్ లావాదేవీలు చేసేటప్పుడు జీఎస్‌టీతో పాటు గరిష్టంగా రూ.20 వసూలు చార్జీల రూపంలో చేయనుంది. అక్టోబర్ 2021లో ఐఎంపీఎస్‌ లావాదేవీల పరిమితిని ఆర్బిఐ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన విషయం మనకు తెలిసిందే. 

► ఫిబ్రవరి 1 నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన చెక్ క్లియరెన్స్‌కు సంబంధించిన నియమ & నిబంధనలు మారనున్నాయి. చెక్ చెల్లింపు కోసం వినియోగదారులు సానుకూల చెల్లింపు విధానాన్ని అనుసరించాలి. ప్రస్తుతం ఖాతాదారులు చెక్ జారీ చేసిన తర్వాత ఆ చెక్కుకు సంబంధించిన వివరాలు బ్యాంక్‌కు పంపాల్సి ఉంటుంది. లేకపోతే ఆ చెక్ క్లియర్ అవ్వదు. ఖాతాదారుల భద్రత దృష్ట్యా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పు కేవలం రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఉన్న చెక్కుల కోసం ఇలాంటి నిబంధనలు మార్చింది. తక్కువ మొత్తంలో చెక్కులు జారీ చేస్తే మాత్రం ఈ మార్పులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 

► పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చే నెల నుంచి చార్జీల బాదుడు షురూ చేయబోతోంది. ఫిబ్రవరి 1 నుంచి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోవడం వల్ల మీ ఇన్‌స్టాల్‌మెంట్లు లేదంటే ఈఎంఐ చెల్లింపులు ఫెయిల్ అయితే అప్పుడు బ్యాంక్ రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రూ.100 చార్జీ వసూలు చేస్తున్నారు. డిమాండ్ డ్రాఫ్ట్‌ను క్యాన్సిల్ చేయాలన్నా రూ.150 చెల్లించుకోవాలి.

► ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మాదిరిగానే వచ్చేనెల ఫిబ్రవరి 1, 15వ తేదీ నాడు గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించనున్నాయి. ఫిబ్రవరి & మార్చిలో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఫిబ్రవరి 1న ఎల్‌‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను ప్రభుత్వం తగ్గిస్తుందా? లేదా అనేది చూడాలి.

(చదవండి: బీఎండబ్ల్యూ అనూహ్య నిర్ణయం...! తొమ్మిదేళ్ల ప్రస్థానానికి ఎండ్‌ కార్డ్‌..!)

మరిన్ని వార్తలు