భయం గుప్పెట్లో ఉద్యోగులు.. నీటి బుడగలా ఉద్యోగాలు: భారత్‌లోనూ ఇదే వరుస

23 Mar, 2023 08:32 IST|Sakshi

గత కొన్ని రోజులుగా ప్రపంచంలోని చాలా దేశాల్లోని అగ్ర కంపెనీలు తమ ఉద్యోగులను భారీగా తొలగించాయి, ఇప్పటికీ తొలగిస్తూనే ఉన్నాయి. ఈ జాబితాలో భారతదేశం కూడా ఉంది. మన దేశంలో ఇప్పటికే దాదాపు 36,400 మంది టెక్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.

నిజానికి గడిచిన ఆరు, ఏడు నెలల కాలంలో లిడో లర్నింగ్​, సూపర్​లర్న్​, గోనట్స్ వంటి సంస్థలు వంద శాతం ఉద్యోగులను తొలగించగా.. గోమెకానిక్​, ఫబల్​కేర్​, ఎంఫైన్ వంటి కంపెనీలు 70 నుంచి 75 శాతం ఉద్యోగులను తీసివేశాయి. భారతదేశంలో ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించిన సంస్థల జాబితాలో 'బైజూస్' మొదటి స్థానంలో ఉంది.

బైజూస్ ఇప్పటికే 4,000 మంది ఉద్యోగులను తొలగించింది. అదే సమయంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ 'స్విగ్గీ' 2020 మే నుంచి ఇప్పటివరకు సుమారు 2,880 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. దీనితో పాటు ఓలా క్యాబ్ సర్వీస్ కంపెనీ ఇప్పటికి నాలుగు విడతలుగా 1,400 మందికి గుడ్ బై చెప్పింది.

(ఇదీ చదవండి: Flipkart Summer Offer: వీటిపై 60 శాతం డిస్కౌంట్! మార్చి 26 వరకే..)

భారతదేశంలో మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా సుమారు 503 టెక్ కంపెనీలు ఇప్పటికే లక్షకంటే ఎక్కువమంది ఉద్యోగులను తొలగించాయి. ఇందులో అత్యధికంగా ఉద్యోగులను తొలగించిన కంపెనీలలో 'అమెజాన్' కంపెనీ మొదటి స్థానంలో ఉంది. రానున్న రోజుల్లో మరింతమంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు