మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌- థైరోకేర్‌‌.. భల్లేభల్లే

11 Sep, 2020 13:03 IST|Sakshi

బ్లాక్‌డీల్స్‌ ద్వారా చేతులు మారిన 4.7 కోట్ల షేర్లు 

మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ ఇన్‌స్టిట్యూట్‌ షేరు 18 శాతం ప్లస్‌

కొత్త సీఈవో ఎంపికకు చైర్మన్‌ వేలుమణికి అధికారం

6 శాతం జంప్‌చేసిన థైరోకేర్‌ టెక్నాలజీస్‌

ఒడిదొడుకుల మధ్య దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్లాక్‌డీల్స్‌ ద్వారా భారీ సంఖ్యలో షేర్లు చేతులు మారినట్లు వెల్లడికావడంతో మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ ఇన్‌స్టిట్యూట్‌ కౌంటర్‌ వెలుగులో నిలుస్తోంది. మరోపక్క కొత్త సీఈవో ఎంపికకు వీలుగా చైర్మన్‌ వేలుమణికి అధికారాలను అప్పగిస్తూ బోర్డు తీర్మానించడంతో థైరోకేర్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌కు డిమాండ్‌ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. ఇతర వివరాలు చూద్దాం..

మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ ఇన్‌స్టిట్యూట్
ఉదయం సెషన్‌లో మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ ఇన్‌స్టిట్యూట్‌ కౌంటర్లో బ్లాక్‌డీల్స్‌ ద్వారా 4.7 కోట్ల షేర్లు చేతులు మారినట్లు బీఎస్‌ఈ  డేటా వెల్లడించింది. ఇది కంపెనీ ఈక్విటీలో 5.2 శాతం వాటాకు సమానంకాగా.. కొనుగోలుదారులు, అమ్మకందారుల వివరాలు వెల్లడికాలేదు. ఈ నేపథ్యంలో మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 18.5 శాతం దూసుకెళ్లింది. రూ. 132ను అధిగమించింది. తదుపరి కొంత మందగించింది. ప్రస్తుతం 13.3 శాతం ఎగసి రూ. 127 వద్ద ట్రేడవుతోంది. మ్యాక్స్‌ ఇండియాకుగల హెల్త్‌కేర్ ఆస్తులతో ప్రత్యేక కంపెనీగా మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటైన విషయం విదితమే.

థైరోకేర్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్
కొత్త సీఈవోను ఎంపిక చేసేందుకు చైర్మన్‌ డాక్టర్‌ ఎ.వేలుమణికి అధికారాలను ఇస్తూ బోర్డు తీర్మానించినట్లు థైరోకేర్‌ టెక్నాలజీస్‌ తాజాగా పేర్కొంది. సీఎఫ్‌వో, సీఐవో తదితర పదవులకు సైతం సరైన వ్యక్తులను ఎంపిక చేసేందుకు వేలుమణికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలియజేసింది. తద్వారా చైర్మన్‌ ఎంపిక చేసిన అభ్యర్ధుల పదవీకాలం, వేతనాలు తదితరాలను బోర్డు పరిశీలిస్తుందని వివరించింది. ఈ నేపథ్యంలో థైరోకేర్‌ టెక్నాలజీస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 795 వద్ద ట్రేడవుతోంది. తొలుత 6 శాతం ఎగసి రూ. 810 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. 

మరిన్ని వార్తలు