టిక్‌టాక్‌కు భారీ షాక్‌.. యాప్‌పై అమెరికా ప్రభుత్వం నిషేధం!

28 Dec, 2022 11:59 IST|Sakshi

భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటూ అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో టిక్‌ టాక్‌ను బ్యాన్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే నిషేధం దేశ మొత్తం కాకుండా కేవలం అమెరికా ప్రభుత్వ డివైజ్‌లలో వినియోగించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అందుకు సంబంధించి మార్గదర్శకాల్ని విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు టిక్‌ వినియోగించే అవకాశం కోల్పోనున్నారు. 

చైనా దేశం బైట్‌ డ్యాన్స్‌ సంస్థకు చెందిన టిక్‌టాక్‌ వినియోగడంతో సెక్యూరిటీ సమస్యలు ఉత్పన్నమవుతాయని అమెరికా ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా అమెరికా కాంగ్రెస్‌లో హౌస్‌ ఆఫ్‌ రెప్రజెంటేటివ్స్‌ (ప్రతినిధుల సభ) టిక్‌ టాక్‌ను వినియోగించకుండా నిషేధం విధిస్తూ హౌస్‌ చీఫ్‌ అడ్మినిస్ట్రేటీవ్‌ ఆఫీసర్‌ (సీఏఓ) చట్టసభ సభ్యులు, ఇతర సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వారు టిక్‌ టాక్‌ను వినియోగించేందుకు అనువుగా ఉండే అన్నీ డివైజ్‌లలో యాప్‌ను డిలీట్‌ చేయాలని కోరారు.  

ఇప్పటికే గత వారం టిక్‌ టాక్‌ యాప్‌ సాయంతో అమెరికన్లు, ఇతర అంతర్గత సమాచారాన్ని ట్రాక్‌ చేస్తుందని 19 రాష్ట్ర ప్రభుత్వాలు..గవర్నమెంట్‌కు చెందిన డివైజ్‌లలో మాత్రమే యాప్‌ను వినియోగించకుండా తాత్కాలికంగా బ్లాక్‌ చేశాయి. 

జో బైడెన్‌ సంతకంతో 
కొద్ది రోజుల క్రితం అమెరికా ప్రభుత్వం సెప్టెంబర్ 30, 2023 వరకు ఫెడరల్‌ గవర్నమెంట్‌ డిపార్ట్‌మెంట్‌ విభాగాల నిర్వహణకోసం 1.66 ట్రిలియన్ డాలర్ల నిధుల విడుదల చేసేందుకు ఆమోదించింది. దీంతో పాటు టిక్‌టాక్‌పై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకుంది. సంబంధిత ఫైల్స్‌ మీద దేశాధ్యక్షుడు జోబైడెన్‌ సంతకం చేస‍్తే.. నిషేధం వెంటనే అమల్లోకి రానుంది.

అమెరికాలో యాప్‌ను నిషేధించాలని
యాప్‌ వాడకుండా దేశవ్యాప్తంగా నిషేధాన్ని అమలు చేయాలని యూఎస్‌ చట్టసభ సభ్యులు ప్రతిపాదన తెచ్చారు. కానీ జోబైడెన్‌ ప్రభుత్వం కేవలం హౌస్‌ ఆఫ్‌ రెప్రజెంటేటివ్స్‌, వారి శాఖలకు చెందిన ఉద్యోగులు టిక్‌టాక్‌ వినియోగంపై ఆంక్షలు విధించింది. కాగా, అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టిక్‌ టాక్‌ యాజమాన్యం బైట్‌డ్యాన్స్‌ స్పందించలేదు 

చదవండి👉 ‘నాతో గేమ్స్‌ ఆడొద్దు’..!, ట్విటర్‌ ఉద్యోగులకు ఎలాన్‌ మస్క్‌ వార్నింగ్‌!

మరిన్ని వార్తలు