టిక్‌టాక్ : యూట్యూబ్  "షార్ట్స్" వచ్చేసింది

15 Sep, 2020 08:28 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ : భారతదేశంలో టిక్‌టాక్ నిషేధంతో అలాంటి ప్లాట్‌ఫాంతో గ్యాప్ పూరించడానికి పలు సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో యూట్యూబ్ ఒక అడుగు ముందుంది. షార్ట్స్ పేరుతో టిక్‌టాక్ లాంటి షార్ట్ వీడియో ఫీచర్‌ను లాంచ్ చేసింది. యూట్యూబ్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ జాఫ్ఫ్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో ఈవిషయాన్ని ప్రకటించారు.  ప్రస్తుతానికి "షార్ట్స్"  మొబైల్ యాప్‌గా మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు.15సెకన్ల నిడివిలో లఘు చిత్రాలు, ఆకర్షణీయమైన వీడియోలను షూట్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్టు తెలిపారు. అంతేకాదు త్వరలోనే మరిన్ని ఫీచర్లు జోడిస్తామని, ఇతర దేశాలకు కూడా విస్తరిస్తామని చెప్పారు. (టిక్‌టాక్‌ రేసు నుంచి మైక్రోసాఫ్ట్‌ అవుట్‌)

తమ కొత్త ప్లాట్‌ఫామ్‌లో బహుళ వీడియో క్లిప్‌లను స్ట్రింగ్ చేయడానికి బహుళ-సెగ్మెంట్ కెమెరా, స్పీడ్ కంట్రోల్స్  హ్యాండ్స్-ఫ్రీ రికార్డ్ చేయడానికి టైమర్, కౌంట్‌డౌన్ ఫీచర్లుకూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ ద్వారా అందుబాటులోకి తీసుకురాగా, త్వరలోనే ఐఓఎస్ లో కూడా లాంచ్ చేయనుంది. కాగా భారత్ చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరగడంతో జూన్‌లో టిక్‌టాక్ సహా 58 ఇతర చైనా యాప్‌లను భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. టిక్‌టాక్ కు 120 మిలియన్లకు పైగా వినియోగదారులతో అతిపెద్ద విదేశీ మార్కెట్ ఇండియానే. అటు అమెరికాలో టిక్‌టాక్ కొనుగోలు డీల్ ఇంకా ఖరారు కాని నేపథ్యంలో అమెరికాలో షార్ట్స్ ను  త్వరలోనే లాంచ్ చేయనుందని సమాచారం.  (టిక్‌టాక్‌కు ఫైనల్ వార్నింగ్)

మరిన్ని వార్తలు