'టైమ్ ఫ్లైస్' : ఆపిల్ ఈవెంట్

9 Sep, 2020 19:55 IST|Sakshi

 సెప్టెంబర్ 15  మెగా ఈవెంట్

వర్చువల్ కాన్ఫెరెన్స్ 

5జీ ఐఫోన్,  అప్ డేటెడ్ వాచెస్ రిలీజ్

సాక్షి, న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ సరికొత్త ఉత్పత్తులతో అభిమానులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల అమెరికాలో 2 ట్రిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించి సరికొత్త రికార్డులు నమోదు చేసిన ఆపిల్ ఆన్‌లైన్ ఈవెంట్‌ను హోస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. 'టైమ్ ఫ్లైస్' పేరుతో అట్టహాసంగా ఈ నెల(సెప్టెంబర్) 15న  బిగ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. వీక్షకులు ఈ ఈవెంట్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో,  యూట్యూబ్ ఛానెల్‌లో చూడవచ్చని ఆపిల్ వెల్లడించింది. 

కోవిడ్ సంక్షోభంలో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నఆపిల్  ఈ సందర్భంగా అయిదు కొత్త మోడల్స్ మార్కెట్లో రిలీజ్ చేయనుంది. సరికొత్త కెమెరాతో 5జీ ఫోన్, అప్ డేటెడ్  వాచీలను ఈ సందర్భంగా తీసుకు రానుంది. ముఖ్యంగా ఆపిల్ వాచ్ సిరీస్ 6తోపాటు, కొత్త ఐప్యాడ్ ఎయిర్ ను లాంచ్ చేయనుంది. ఆపిల్ వాచ్ కొత్త సిరీస్ 5 తరహాలోనే ఉన్నప్పటికీ,  కొత్త హెల్త్ ఫీచర్స్ తో పాటు,  డిజైన్ సమగ్రంగా మార్చినట్టు అంచనా.  బ్లడ్ ఆక్సిజన్ మానిటర్, స్లీప్ ట్రాకింగ్, ఇంప్రూవ్ ఈసీజీ లాంటి కొత్త ఫీచర్లతో వస్తుంది. సరసమైన, అందుబాటు ధరల్లో ఆపిల్ వాచ్‌ను ఆవిష్కరిస్తుందని  భావిస్తున్నారు. అలాగే ఆపిల్ కొత్త ఐప్యాడ్‌ను వేగవంతమైన ప్రాసెసర్, థిన్ బెజెల్స్‌ డిస్ ప్లే తో లాంచ్ చేయనుంది. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల కారణంగా కొత్త ఐఫోన్ 12 మోడళ్లు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఈ ఏడాది ప్రారంభంలో ఆదాయ ఫలితాల సందర్భంగా ఆపిల్ ధృవీకరించింది. దీంతో  కొత్త ఐఫోన్ 12  ఆవిష్కారంపై పెద్దగా అంచనాలు లేవు. అయితే ఆపిల్ 12 పై ఇంట్రస్టింగ్  విషయాలను వెల్లడించే అవకాశం ఉందనే ఆసక్తి మాత్రం భారీగా నెలకొంది.  మరోవైపు 100 బిలియన్ డాలర్ల విలువైన మొబైల్ ఫోన్‌లను భారతదేశంలో ఎగుమతి చేసే ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు