రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న బంగారం ధర!

9 Apr, 2021 15:58 IST|Sakshi

బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఏప్రిల్ 1 నుంచి రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయి. దీనికి ప్రధాన కారణం కరోనా కేసులు భారీగా పెరగడమే అని నిపుణులు భావిస్తున్నారు. గత ఏడాది కూడా కరోనా సమయంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కరోనా విజృంభిస్తే మళ్లీ లాక్‌డౌన్లు, కర్ఫ్యూలు, కంటైన్‌మెంట్ జోన్ల ఏర్పాటు చేసే అవకాశం ఉండటం వల్ల స్టాక్ మార్కెట్లు పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారు తమ షేర్లను అమ్మే అవకాశం ఉంటుంది. ఇలా వారి చేతిలో ఉన్న నగదును బంగారం మీద స్వల్ప కాలానికి పెట్టుబడి పెట్టె అవకాశం ఉంటుంది కాబట్టి బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

నేడు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇండియన్ బులియన్, జెవెల్లెర్స్ అసోసియేషన్ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,152 నుంచి రూ.46,554కు పెరిగింది. అలాగే, నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.42,275 నుంచి 42,643కు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర నేటి ఉదయం 10 గ్రాములు రూ.43,000 నుంచి రూ.43,500కు చేరుకుంది. నిన్నటి నుంచి ధర రూ.500 పెరిగింది. అలాగే పెట్టుబడులు పెట్టేందుకు వాడే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.46,900 నుంచి రూ.47,460కు పెరిగింది ఉంది. అంటే ఒక్కరోజులో రూ.560 రూపాయలు పెరిగింది అన్నమాట. హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. నేడు కేజీ వెండి ధర రూ.66,905 నుంచి రూ.67,175కు పెరిగింది.

చదవండి: 

కరువు తెచ్చిన అదృష్టం!

బిలియనీర్ల అడ్డాగా బీజింగ్!

మరిన్ని వార్తలు